జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం అని పేరు పెట్టి నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి పోస్టర్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. జూన్ నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. ఆ రోజు ప్రజా తీర్పు వెలుగులోకి వచ్చింది. ఆ రోజును వెన్నుపోటు దినం అంటూ వైసీపీ నిరసనలు చేపట్టడం ఆశ్చర్యకరంగా మారింది. కనీసం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రోజు నిర్వహించిన ఓ అర్థం ఉండేదని ప్రజాతీర్పు వచ్చిన రోజున నిర్వహించడం అంటే.. ప్రజల్ని అవమానించినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వైసీపీ ఉద్దేశం కూడా అదేనని చెబుతున్నారు. తాము జనం ఖాతాల్లో రెండున్నర లక్షల కోట్లు వేశామని అయినా ప్రజలు ఇంకా ఎక్కువ హామీలకు ఆశపడి ఓట్లు వేశారని జగన్ రెడ్డి అంటూంటారు. అంటే.. ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన పరోక్షంగా చెబుతున్నట్లే. ఈ కోణంలో ప్రజలపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం వైసీపీలోనూ హాట్ టాపిక్ గా ఉంది.
ప్రజా తీర్పును వ్యతిరేకిస్తూ ప్రజల్ని వెన్నుపోటుదారులుగా చెబుతూ నిర్వహిస్తున్న నిరసనలకు.. ప్రజలు ఎలా వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సందేహంగానే ఉంది. గతంలో కొన్నినిరసనలు తూ..తూ మంత్రంగా నిర్వహించి.. వంద, రెండు వందల మంది అడ్డాకూలీలతో ప్రదర్శనలు నిర్వహించి సాక్షి పేపర్ లో రాసుకున్నారు. ఈ సారి కూడా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి.