కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను విజయ్ .. చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు. ఓ రిసార్టులో ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడారు. ఓదార్చారు. వారి కష్టాలను విన్నారు. వారి సమస్యలను రాతపూర్వకంగా తీసుకుని తాను ఏ విధంగా మీ కుటుంబానికి అండగా ఉండగలను అని అడిగారు. వారు చెప్పిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్నారు. ఇల్లు, చదువులు, అనారోగ్యం ఇలాంటి ఏ విషయమైనా ఇక తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాల వద్ద కన్నీరు పెట్టుకున్న విజయ్
తమతో మాట్లాడుతున్నప్పుడు విజయ్ కన్నీరు పెట్టుకున్నారని బాధిత కుటుంబాలు తర్వాత మీడియాకు చెప్పాయి. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆయన బాధితుల్ని కలవగలిగారు. తొక్కిసలాట జరిగినప్పుడు పారిపోయారని ప్రచారం జరగడంతో విజయ్ ఇబ్బంది పడ్డారు. తర్వాత బాధితుల్ని పరామర్శించలేకపోయారు. కరూర్ కు మళ్లీ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ఆయన వెనుకడుగు వేశారు. అలాగని బాధితుల్ని పరామర్శించకపోతే.. ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ముందు ఆ బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో చెన్నైకు పిలిపించుకుని.. విజయ్ తన పని పూర్తి చేశారు. బాధిత కుటుంబాల అభిమానాన్ని పొందారు.
మారిన వ్యూహంతో ప్రచారం ప్రారంభం
కరూర్ ఘటన కారణంగా విజయ్ ప్రచార ప్రణాళికలన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నించడం మానేశారు. కార్యకలాపాల నిలిపివేత పార్టీలోపల కమ్యూనికేషన్ గ్యాప్ను సృష్టించింది. విజయ్ గతంలో “వర్చువల్ వారియర్స్” అని పిలిచిన సోషల్ మీడియా మద్దతుదారులు పార్టీ పనితీరు, రెండో స్థాయి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుచి, పెరంబలూరు, నాగపట్టణం, తిరువారూరు జిల్లాల్లో పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. కరూరు ఘటన తర్వాత భద్రతా ఆందోళనలు ముందుకు వచ్చాయి. దీంతో పార్టీ క్యాంపెయిన్ వ్యూహాన్ని సమీక్షించి, ప్రత్యామ్నాయ ఔట్రీచ్ ఫార్మాట్లను పరిగణనలోకి తీసుకోనుంది.
భద్రతా ఆందోళనల నేపథ్యంలో, భారీ ర్యాలీలకు బదులుగా డిజిటల్, చిన్న స్థాయి సమావేశాలు లేదా ప్రత్యామ్నాయ ప్రచార పద్ధతులను టీవీకే పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.
సీబీఐ కేసులోనూ టీవీకే నేతలే నిందితులు
మరో వైపు తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ప్రాథమికంగా కేసు నమోదుద చేసింది. ఇందులోనూ టీవీకే నాయకులే నిందితులుగా ఉన్నారు. వారే నిందితులు అన్న కోణంలో విచారణ జరగనుంది. సీబీఐ విచారణలో ఏం తేలినా విజయ్ వ్యతిరేకించలేరు. ఎందుకంటే ఆయనే కావాలని సీబీఐ విచారణ తెచ్చుకున్నారు.
