విజయసాయిరెడ్డి ప్రత్యేక వ్యూహంతో ఉన్నారు. ఆయన జగన్ రెడ్డిపై అభిమానం చూపిస్తున్నారు. తనను నమ్మడం మానేశారు కాబట్టి తాను దేవుడిగా భావించి పూజలు చేయడం లేదని .. కానీ తనకు జగన్ అంటే ఎంతో అభిమానం ఉందని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో ప్రచారం జరుగుతోందని తరచూ ట్వీట్లు పెడుతున్నారు. అందులో జగన్ పై అభిమానాన్ని వ్యూహాత్మకంగా బయట పెడుతున్నారు.
జగన్ గురించి ఒక్క సీక్రెట్ కూడా బయట పెట్టబోనని ట్వీట్లు
జగన్ గురించి చాలా విషయాలు విజయసాయిరెడ్డి చెబుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తాజాగా ట్వీట్లు పెట్టారు. తాను వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ జగన్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని.. దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో ఏ -వన్ రాజ్ కెసిరెడ్డి గురించే చెప్పానన్నారు. ఇతర కేసుల వ్యవహారాల్లోనూ జగన్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని కోటరీనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని అంటున్నారు.
విజయసాయిరెడ్డి టార్గెట్ కోటరీ !
వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయినా విజయసాయిరెడ్డి ప్రత్యేక వ్యూహంతో రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే మళ్లీ జగన్ అభిమానం కోసం ప్రయత్నిస్తున్నారు. కోటరీ వల్ల జగన్ రెడ్డి పూర్తిగా నష్టపోతున్నారన్న అభిప్రాయాన్ని ఆయనకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తాను లేకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కూడా జగన్ కు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కోటరీని ఇలా ప్రోత్సహిస్తే తనను రెచ్చగొట్టి వారు .. జగన్ కు వ్యతిరేకంగా నిజాలు చెప్పిస్తారన్న ఓ హెచ్చరికను కూడా మెల్లగా విజయసాయిరెడ్డి పంపుతున్నారు.
కోటరీని దూరం చేసి తాను దగ్గరయ్యే ప్లాన్లు
విజయసాయిరెడ్డి కోటరీని దూరం చేసి.. తాను దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. కోటరీ దూరం అయితే ఆటోమేటిక్ గా విజయసాయిరెడ్డినే జగన్ రెడ్డికి ఆప్షన్. ఇప్పుడు జగన్ ఆ కోటరీ మాయలో ఉన్నారు. కానీ ఆయనతో సందేహాలు, అనుమాన బీజాలు పడితే …ఆ కోటరీని తరిమేయడానికి ఎక్కవ కాలం పట్టదు. అలాంటిది ప్రారంభమయిందని విజయసాయిరెడ్డి నమ్ముతున్నారు. అందుకే జగన్ రెడ్డి మైండ్ సెట్ తెలుసు కాబట్టి దానికితగ్గట్లుగా రాజకీయం చేస్తున్నారు. మరి కోటరీ తట్టుకోగలదా ?