విశాఖలో పెట్టుబడుల సదస్సు ఊహించిన దాని కన్నా ఎక్కువగా విజయవంతం అయింది. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చారు. వచ్చినవారందరూ ఎంవోయూలు చేసుకోరు. అలాగే ఎంవోయలు చేసుకున్న వాళ్లంతా పెట్టుబడులు పెట్టరు. కానీ ఓ గ్రౌండ్ అయితే ఏర్పాటవుతుంది.దాని ద్వారా ప్రభుత్వం,అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి.. పెట్టుబడుల్ని గ్రౌండ్ అయ్యేలా చేసుకోవాల్సిన ఉంటుంది. ఈ విషయంలో ఎంవోయూల కోసం ఎంత కష్టపడ్డారో.. అంతకు మించి ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు కష్టపడాల్సి ఉంటుంది.
సగానికి సగం ఏడాదిలో పనులు ప్రారంభించినా అద్భుతమే
పదమూడు లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటిలో మరో ఏడాదిలో సగం అయినా గ్రౌండింగ్ ప్రారంభిస్తే.. ఉద్యోగాలు రావడం ప్రారంభమవుతుంది. చాలా కంపెనీలు తమ ప్లాంట్ నిర్మించడం ప్రారంభించిన ఏడాది, రెండేళ్లలోనే ఉత్పత్తులు ప్రారంభిస్తాయి. కొన్ని కొన్ని కంపెనీలకు అది కూడా అవసరం లేదు. ఇంకా వేగంగా ఉత్పత్తి ప్రారంభించగలవు. అందుకే ఈ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలన్నీ అసలు పెట్టుబడులతో వచ్చేలా ప్రభుత్వం చాలా కేర్ ఫుల్గా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది.
వ్యాపారసంస్థలకు ఇలా అనుకోగానే అలా పెట్టుబడులు పెట్టలేవు !
చాలా కంపెనీలు..తమ భవిష్యత్ అవసరాల కోసం .. ఓ ప్లాంట్ ఓ ప్రాంతంలో పెట్టాలనుకున్నప్పుడో …విస్తరణ కోసమో ప్రయత్నించినప్పుడు.. ఇలా అనుకుని అలా పనులు ప్రారంభించలేవు. ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వాల నుంచి వారికి వచ్చే రాయితీలు, ఇన్సెంటివ్స్ కూడా ముఖ్యమే. కొన్ని వ్యాపార సంస్థలు గొంతెమ్మ కోరికలు కోరుతాయి. అలాంటి వాటిని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించలేవు. మధ్యలో డ్రాప్ కావాల్సి ఉంటుంది. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉన్నట్లే.. కంపెనీల యాజమాన్యాల్లోనూ ఉంటాయి. అయితే వారిని సరిగ్గా డీల్ చేయాల్సిన పద్దతిలో డీల్ చేస్తే.. సక్సెస్ రేటు ఎక్కువగాఉంటుంది.
ప్రజలకు నిరంతరం సమాచారం తెలియాలి!
ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకుంది. ఇది అద్భుతమే. కానీ వైసీపీ హయాంలో చేసుకున్నట్లుగా ఇవి ప్రచార ఒప్పందాలు కాకూడదంటే వెంటనే.. ఓ ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించాలి. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మాత్రమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్న ఎంవోయూలన్నీ అందులో పెట్టాలి. అవి ఎంత వరకూ గ్రౌండ్ అవుతున్నాయి… ఎంత మేర పనులు చేస్తున్నాయి.. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తాయన్నది స్టేటస్ రిపోర్టు అందులో ఉండాలి. అలాగే ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించిన్నది కూడా చెప్పగలగాలి. అంత పారదర్శకత పాటిస్తే.. ప్రజలకు కూడా జరుగుతున్న ప్రచారానికి.. వాస్తవికత ఏమిటో అంచనా వేసుకోగలుగుతారు.
ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం నారా లోకేష్ టార్గెట్. తాము ఇచ్చేశామని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. తాము తెచ్చిన కంపెనీలు.. వచ్చిన ఉద్యోగాలు.. ఆ ఉద్యోగాల్లో కుదురుకున్న నిరుద్యోగుల పూర్తి సమాచారం.. అందుబాటులో ఉండాలి. అప్పుడు.. పడిన కష్టానికి సార్థకత లభిస్తుంది. లేకపోతే బూడిదలో పోసిన పన్నీరవుతుంది.


