విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాంబిల్లి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ – NAOB వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రహదారి భోగాపురం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం గుండా రాంబిల్లిని కలుపుతుంది. విశాఖ మహానగర రద్దీని తగ్గించడంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మలుపుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయనుంది. భోగాపురం విమానాశ్రయం నుండి రాంబిల్లిలోని రక్షణ, పారిశ్రామిక కేంద్రాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభించడం వల్ల లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటుంది. ఐటీ సెంటర్లు, ఫార్మా సిటీ , పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ఈ సెమీ రింగ్ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది. దీనివల్ల విశాఖ నగరం లోపలికి భారీ వాహనాల రాక తగ్గి, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సెమీ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే భోగాపురం నుండి రాంబిల్లికి ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. విశాఖను గ్లోబల్ హబ్గా మార్చే వ్యూహంలో భాగంగా ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
