రాజధాని లేని రాష్ట్రం కోసం తమ భూమిని రూపాయి తీసుకోకుండా ఇచ్చారు అమరావతి రైతులు. అమరావతి ఎదిగితే దానితో పాటు తాము కూడా ఎదగాలనుకున్నారు. కానీ వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ టెర్రరిజాన్ని వారు ఫేస్ చేశారు. వందల కేసులు ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓ గొప్ప పోరాటం ద్వారా సాకారం అయ్యే ప్రతి కల చరిత్రలో నిలిచిపోతుంది. రైతుల పోరాటం ద్వారా అమరావతి అలా నిలబడుతోంది. మరి ఆ రైతులపై ఉన్న కేసుల పరిస్థితేమిటి?
వైఎస్ జగన్.. కేసుల విప్లవం తెచ్చారు. అసలైన నేరస్తుల్ని వదిలేసి.. వారిని పార్టీ మద్దతుదారులుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్లుగా నేరాలు చేయించారు. హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు. పోలీసులే ఘోరంగా వ్యవహరించారు. అమరావతి రైతులపై వందల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారందరిపై కేసులు తొలగించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ కేసుల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాయిదాలకు తిరగలేకపోతున్నారు. చివరికి పాస్ పోర్టులు కూడా రావడం లేదు.
పార్టీ క్యాడర్ పై పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. వాటి విషయంలోనూ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఓ కమిషన్ వేసి ఇలాంటి తప్పుడు కేసులన్నింటినీ తీసేస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఇంకా ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు. న్యాయపరంగా చిక్కులు లేకుండా కేసులు క్లోజ్ చేయాలంటే కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతూంటాయి. దీన్ని ఎవరూ కాదనరు.. కానీ ప్రాసెస్ జరుగుతోందన్న నమ్మకం ఈ బాధితులకు కలగాలి. అలాంటి ప్రయత్నం ఏమైనా ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతోందా ?