ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు కాస్త విషాదంగా మారాయి. 18ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి విన్నర్ అయిన ఆర్సీబీకి ఆ ఆనందం ఎంతోసేపు లేకుండా చేసేసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదిమంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఈ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణంగా తెలుస్తోంది. ఆర్సీబీ గెలుపును యావత్ దేశం ఎంజాయ్ చేసింది. అలాంటిది అభిమాన ఆటగాళ్ళు చిన్నస్వామి స్టేడియంకు వస్తున్నారంటే అక్కడి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రాకుండా ఎలా ఉంటారు. తప్పకుండా పెద్ద సంఖ్యలో వస్తారు. కానీ , అభిమానుల సంఖ్యకు తగ్గట్టుగా స్టేడియం వద్ద ఏర్పాట్లు చేయలేదు. ఫలితం పదిమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి ఆగిపోయెందుకు కారణమైంది.ఈ తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని కర్ణాటక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పదుల సంఖ్యలో సొమ్మసిల్లిపడిపోయారు. స్పృహతప్ప్పి పడిపోయిన వారిని బ్రతికించేందుకు సీపీఆర్ చేశారు. అయినా అక్కడికక్కడే కొంతమంది మృతి చెందారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని బాధితులను సీఎం సిద్దరామయ్య పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ క్షమాపణలు చెప్పారు.