ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఆంధ్రులపైన ద్వేషం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే చులకన ఎందుకు? రాధాకృష్ణగారి కొత్తపలుకును చదివిన ఎవ్వరికైనా ముందుగా వచ్చే సందేహం ఇధేే. తెలంగాణా ఉద్యమ కాలం నుంచీ కూడా రాధాకృష్ణ రాతలు ఇలాగే ఉంటున్నాయి. తెలంగాణా ఉద్యమాన్ని ఎగదోయడంలో తాను ఎంత గొప్ప పాత్ర పోషించాడో ఆయనే పేజీలకు పేజీలు రాసుకొచ్చాడు. తెలంగాణా ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో కష్టపడ్డాను అనే విషయాలన్నీ కూడా ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ. అదే ఆంధ్రా విషయానికొస్తే మాత్రం ఆయనకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాడు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నవాళ్ళను నిరుత్సాహపరుస్తాడు. సమైక్యాంధ్ర ఉద్యమం అనకుండా ఆంధ్రాకు ఏం కావాలో కోరుకుని ఉంటే అద్భుతాలు జరిగి ఉండేవని ఈ రోజుకీ చెప్తాడు. ఆ విషయంలో ఆంధ్రా నేతలు ఫెయిలయ్యారని ఈ రోజుకీ నిందిస్తూ ఉంటాడు. 2014లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రా-తెలంగాణా ప్రజలందరినీ మెప్పించేలా ఏ నాయకుడూ సరైన నిర్ణయం తీసుకోలేడని రాధాకృష్ణకు తెలియదా? తెలంగాణా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో నూకలు చెల్లిపోయినట్టేనని తెలియనంత అమాయకురాలా సోనియా గాంధీ? ఆంధ్రాలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర విభజన నిర్ణయం అంతా కూడా తెలంగాణాకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు సోనియా అండ్ కో. భద్రాచలంతో సహా అన్నీ తెలంగాణాకు ఇచ్చేశారు. సీమాంధ్రజనాలకు మాటలు చెప్పారు. సీమాంధ్ర నాయకులు ఎవరు ఎన్ని గావుకేకలు పెట్టినా, అడుక్కున్నా సరే…తెలంగాణా కంటే ఎక్కువ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి కల్పించే అవకాశమే లేదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాబట్టి. ఒకసారి తెలంగాణా అంటూ ఇచ్చిన తర్వాత ఇక ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిలబడే అవకాశమే లేదు కాబట్టి. ఈ విషయాలన్నీ రాజకీయాలపైన అవగాహన ఉన్నవాళ్ళందరికీ తెలుసు. రాధాకృష్ణకు కూడా తెలుసు. కానీ తన సలహా పాటించకపోవడం వళ్ళే సీమాంధ్ర నష్టపోయింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా వెంకయ్యనాయుడు, చంద్రబాబుల హీరోయిజానికి ఇబ్బందిరాకుండా చూసుకుంటూ ఉంటాడు.
ఇక ఇప్పటి వరకూ సీమాంధ్ర నాయకులనే టార్గెట్ చేసిన రాధాకృష్ణ…ఈ రోజు కొత్త పలుకులో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా టార్గెట్ చేశాడు. హైదరాబాద్లో ఉంటున్న గుజరాతీలు, మార్వాడీలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడంబరంగా ఉంటారట. వాళ్ళ సంపదను ప్రదర్శిస్తూ ఉంటారట. అందుకే తెలంగాణా ప్రజలకు ఆంధ్రులపైన కోపం వచ్చిందట. 2014కు ముందు ఉన్న పరిస్థితుల గురించి రాసుకొచ్చిన రాధాకృష్ణ…అప్పుడు హైదరాబాద్లో ఉన్న గుజరాతీ, మార్వాడీలను ఆంధ్రులను కూడా ఒకే గాటన కట్టేశాడు. అంటే హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం కాదా? సొంత రాష్ట్రంలో ఎలా బ్రతకాలో కూడా రాధాకృష్ణలాంటి వాళ్ళు చెప్తారా? అయినా గుజరాతీలు, మార్వాడీల కంటే ఆంధ్రుల ఆడంబరంగా జీవిస్తారు అని రాధాకృష్ణకు ఎవరు చెప్పారు? ఆడంబరాల విషయంలో కెసీఆర్కి, చంద్రబాబుకి ఏమైనా తేడా ఉందా? అయినా ఒక ప్రాంత ప్రజలందరిపైనా ఆడంబరులు అన్న ముద్ర ఎలా వేసేస్తారు? 2014కు ముందు వరకూ సీమాంధ్ర ప్రజలందరినీ కూడా ఐదేళ్ళపాటు మానసికంగా హింసించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కానీ, ప్రజల కష్టాలు కానీ ఎవరికైనా కన్నీళ్ళు తెప్పించే పరిస్థితుల్లో ఉన్నాయి. గత కొన్ని రోజుల ఈనాడు పత్రిక తిరగేసినా చాలు…వాస్తవ పరిస్థితులు కళ్ళకు కడతాయి. ఇంకా నిందలు మోపడం ఎంత వరకు? అయినా దాడులు చేసిన వాళ్ళను, దాడులు చేసేలా రెచ్చగొట్టినవాళ్ళను విమర్శించడం మానేసి బాధితులను విమర్శించడమేంటి? అమెరికా విషయం పక్కన పెడితే 2014 సమయంలో నష్టపోయింది సీమాంధ్రులే. ఇప్పటికీ కష్టాలు పడుతున్నది సీమాంధ్రులే. అలాంటి వాళ్ళపైనా ఇంకా అభాండాలు వేయడం, వాళ్ళ జీవనవిధానాలను విమర్శించడం అంటే కచ్చితంగా ఆక్షేపణీయమే. అయినా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఆంధ్రులపైన ద్వేషం ఎందుకు? ఆయన బిజినెస్లు కూడా ఆంధ్రాలోనే ఉన్నాయిగా. టిడిపి పుణ్యమాని ఆంధ్రజ్యోతి మీడియాను ఆదరించే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. కానీ ఈయనగారు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రులను విమర్శించడం….ఆ తర్వాత తనకు తోచిన సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనాస్థాయి కంటే నా మేథస్సు గొప్పది అని నిరూపించుకోవాలనా? లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తన ఆలోచనల ప్రకారం నడుచుకోవాలన్న తాపత్రయమా?