ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం యోగా. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ 21ను అంతర్జాతీయ యోగాడేగా ప్రకటింపచేశారు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా డే ఘనంగా జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ప్రతీ సారి ఓ వేదికలో పాల్గొంటూ ఉంటారు. ఈ సారి విశాఖలో యోగా డే లో పాల్గొననున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచం అంతా చర్చించుకునేలా నిర్వహిస్తున్నారు.
‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల తీరప్రాంతంలో 5 లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇది గిన్నిస్ రికార్డు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద యోగాసనాలు వేస్తారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా యోగా చేస్తారు.
అమరావతి పనుల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ .. విశాఖలో యోగాడే కు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మోదీ అదే వేదిక మీద అంగీకరించారు. ఆ తర్వాత 3 మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర-2025’ పేరిట నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు స్థాయిలో యోగా శిక్షణ కార్యక్రమాలు, పాఠశాలల్లో రోజూ గంట యోగా శిక్షణ, పెయింటింగ్, వ్యాసరచన వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. – 10 లక్షల మందికి యోగా కోర్సులు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు.
ఏదైనా ఈవెంట్ నిర్వహించడంలో చంద్రబాబు ఆలోచనలు ప్రపంచ స్థాయిలోనే ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా… అమరావతిసభలో అదే అన్నారు. దేశంలో అతి పెద్ద ఈవెంట్ ఏదైనా నిర్వహించాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు అని ప్రశంసించారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈవెంట్ ను ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ఆరోగ్య వారసత్వాన్ని మరోసారి ప్రపంచానికి విశాఖ వేదిక నుంచి చాటనున్నారు.