అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం అబ్బురపడేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.
యోగా అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అని మహర్షి పతంజలి చెబుతారు.. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని అంగీకరించింది. అందుకే ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాకీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సారి విశాఖలో రికార్డులు బద్దలు కొట్టబోయే యోగా కార్యక్రమం జరగనుంది. ప్రపంచ స్థాయిలో నిర్వహించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించనున్నారు. నెల రోజులుగా యోగాంధ్ర పేరుతో సన్నాహాలు చేస్తున్నారు.
ఇంతకు ముందు గిన్నిస్ రికార్డు సూరత్లో నిర్వహించిన యోగా కార్యక్రమం పేరు ఉంది. ఈ రికార్డును అధిగమించాలని నిర్ణయించారు. యోగాంధ్ర గిన్నిస్ రికార్డులో భాగమయ్యేందుకు రెండున్నర కోట్ల మంది ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రత్యేకంగా ట్రైనర్లను కూడా పిలిపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా , ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేశారు. ఈ మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయిలో దాదాపు 1.5 లక్షల మంది స్థానిక శిక్షకులకు శిక్షణ ఇచ్చారు.
జూన్ 21న ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు విశాఖపట్నంలో యోగాంధ్ర నిర్వహిస్తారు. RK బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల తీరప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలాలను ఉపయోగించి దాదాపు 300,000 మంది ప్రజలు ఏకకాలంలో యోగా చేస్తారు. నగరంలోని 15 ఇతర ప్రాంతాల నుండి అదనంగా 200,000 మంది పాల్గొంటారు. మొత్తం ఐదు లక్షల మంది విశాఖలో యోగా చేస్తారు.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 100,000 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఒకే ప్రోటోకాల్ను అనుసరించి యోగా సెషన్లు నిర్వహిస్తారు. 53,000 పాఠశాల ప్రాంగణాలు, 40,000 నివాస ప్రాంతాలు, గ్రామ,వార్డు సచివాలయాలు , మండల, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి కేంద్రాలు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2 కోట్ల మందిని పాల్గొంటారు.