కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్లకు మద్దతుగా తెనాలి వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం ఆలోచించని జగన్ రెడ్డి తెనాలిలో చంద్రబాబు పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరిపై పదేసి కేసులు ఉండి..దోపిడీలు, దొంగతనాలు,దాడులు చేసిన ఆ ముగ్గురు రౌడీషీటర్లను మహాత్ములన్నట్లుగా .. వారిని పరామర్శించిన తర్వాత జగన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయని ఆయనను నడిరోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా అని వ్యాఖ్యానించారు.
జగన్ రెడ్డి తీరు ఎంత అసహ్యంగా ఉంటుందో కనీసం వైసీపీ పార్టీ నాయకులకు అయినా అర్థం అవుతుందో లేదో. చంద్రబాబుపై ఉన్న ఆ కేసులన్నీ.. జగన్ తనపై ఉన్న కేసులకు పోటీగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి పెట్టించినవే. అందులో ఒక్కదానికైనా సాక్ష్యాలు ఉన్నాయని ఎవరూ చెప్పరు. జగన్ రెడ్డి ప్రజాధనాన్ని లూఠీ చేసి ముఫ్పైకి పైగా కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఆయనను ఎవరూ రోడ్డున పడేసి కొట్టలేదే. అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు సహా అందర్నీ కొట్టించిన వ్యక్తి ఆయన. ఆయన కూడా ముగ్గురు రౌడీ షీటర్లు కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేస్తే పోలీసులు కొడితే దాన్ని కూడా కుల, మతాలకు కలిపి రాజకీయం చేస్తున్నారు.
కానిస్టేబుల్ పై ఈ రౌడీ షీటర్లు దాడి చేయలేదట. కానిస్టేబుల్ యూనిఫామ్లో లేడట.. .కానిస్టేబుల్ అన్న విషయం కూడా వీరికి తెలియదట.. -గొడవపడుతున్న కానిస్టేబుల్ను యువకులు ప్రశ్నించారట.. – కానిస్టేబుల్ను క్వశ్చన్ చేయడమే రౌడీలు చేసిన తప్పట. జగన్ రెడ్డి మాజీ సీఎం అనే గౌరవాన్ని కూడా ప్రజల ముందు పోగొట్టుకుంటున్నారు. ఈ రౌడీషీటర్ల పరామర్శ వ్యవహారం.. ఆయనకు.. ఆయన పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.