అధికారంలో ఉన్నప్పుడు ఆ మత్తులో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతిపక్షంలోకి వచ్చాక మారుతారని ప్రజలు భావించినా మారలేదని జగన్ మళ్లీ , మళ్లీ రుజువు చేస్తున్నారు. ప్రతిపక్షంలో వచ్చాక ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, వాటి ఆధారంగా ముందుకు వెళ్తే అధికారంలోకి రావడం కష్టమేమి కాదు. యాదృచ్చికంగా చేస్తున్నారో, పొరబడి చేస్తున్నారో కానీ జగన్ రాజకీయాలు వైసీపీని మరింత పాతాళంలోకి వెళ్లేలా చేస్తున్నాయి.
ఏపీలో ఏదీ జరిగినా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెనాలి ఇష్యూలోనూ పోలీసుల వైఖరిని ఖండిస్తూ కూటమి హయాంలో పోలీసులు రెచ్చిపోతున్నారని, ప్రజలకు భద్రత లేకుండా చేస్తున్నారని బాధితులను పరామర్శించిన తర్వాత జగన్ చెప్పుకొచ్చారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసుపై గంజాయి మత్తులో హత్యాయత్నం చేసిన రౌడీలను శిక్షిస్తే జగన్ కు తప్పుగా కనబడింది. నేరస్తులకు మద్దతుగా నిలవడం అంటే టీడీపీని వ్యతిరేకించడం అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ గంజాయి బ్యాచ్ కు మద్దతుగా నిలిస్తే వైసీపీకి బలం పెరుగుతుందని జగన్ ఆలోచన.
జగన్ ఇప్పుడు పెట్టుకుంటున్నది టీడీపీతోనే అనుకుంటున్నారు. ఆయన పోలీసులతో తలపడుతున్నారు. ఐదేళ్లు జగన్ కు రక్షణగా నిలిచిన పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. వారినే రౌడీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేరస్తులను మహాత్ములుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రాజకీయాలను చూసి వైసీపీ నేతలే నోరెళ్ళబెడుతున్నారు. పోలీసు వ్యవస్థతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రాజకీయ పార్టీ నేతలకు, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు తెలియనిది కాదు. అన్ని మసులుకొని ఉంటే మంచిది. లేదంటే జగన్ రెడ్డి మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం.