ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని పీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతించారు. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక తీర్మానంపై ఆమె స్పందిస్తూ.. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతున్న మాట అని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి ఈ తీర్మానం ముగింపు పలకాలని ఆమె ఆకాంక్షించారు.
విభజన చట్టంలో అమరావతి పేరును చేర్చడం ద్వారా భవిష్యత్తులో పాలకులు మారినా రాజధాని మారకుండా ఉండేలా బలమైన రక్షణ లభిస్తుందని, ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన వేలాది మంది అమరావతి రైతుల పోరాటానికి ఈ తీర్మానం ఒక విజయమని షర్మిల అన్నారు. రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చింది రాజధాని నిర్మాణం కోసమేనని, గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుత తీర్మానంతో రైతుల్లో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయని, ప్రభుత్వం వెంటనే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక ఎత్తయితే, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చట్టబద్ధత కల్పించేలా చేయడం మరో ఎత్తని షర్మిల గుర్తుచేశారు. పార్లమెంట్లో విభజన చట్ట సవరణ బిల్లు వెంటనే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఏకైక రాజధానికే మొగ్గు చూపుతుందని, అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే ప్రజాహిత నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
