రాజ్యసభలోనూ వైసీపీ అమరావతి బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విచిత్రమైన వాదన చేశారు. బిల్లులో ప్రత్యేక హోదా లేదన్నారు. బిల్లులో కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని ..రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు. రాజ్యాంగంలో రాజధాని అంశం లేదన్నారు.
స్పష్టంగా తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.. అయితే వెంటనే.. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అంటున్నారని తెలిపారు. రెండేళ్లలోనే రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారని ఇలాగే కొనసాగితే రూ.14 లక్షల కోట్లకు అప్పు చేరుతుందని ప్రసంగించారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తాను రాసుకొచ్చింది గబగబా చదివేసి సుబ్బారెడ్డి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
వైసీపీ లోక్ సభలోనూ అదే చేసింది. రాజధాని బిల్లును వ్యతిరేకించి ఒకే ఒక్క పార్టీగా వైసీపీ నిలిచింది. రాజ్యసభలో ఇతర అన్ని పార్టీలకు చెందిన వారూ బిల్లును సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు కూడా సమర్థించారు. కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి.. జగన్ తీసుకున్ననిర్ణయాలు చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట్లాడిన అన్ని పార్టీల నేతలూ సమర్థించారు.

