రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, ఇంటిగ్రేషన్ , టెస్టింగ్ సెంటర్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న మొట్టమొదటి ఐదవ తరం యుద్ధ విమానం AMCA కు పుట్టపర్తి ప్రధాన కేంద్రంగా మారబోతోంది. సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో, దాదాపు రూ.15,803 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ,వాటి పనితీరును పరీక్షించే అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ భారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగా, వేల సంఖ్యలో పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా, దీని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ ఎనర్జిటిక్స్, మందుగుండు సామాగ్రి తయారీ ప్లాంట్లు, డ్రోన్ సిటీ ప్రాజెక్టులకు కూడా ఇదే వేదికగా శంకుస్థాపనలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్ త్వరలోనే నేషనల్ డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుందని రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.
గతంలో మనం రక్షణ పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్ళం, కానీ నేడు ప్రపంచ స్థాయి యుద్ధ విమానాలను మన గడ్డపైనే తయారు చేసుకునే స్థాయికి చేరాం. ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న చొరవ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల దక్షిణ భారతం రక్షణ రంగ హబ్గా మారుతోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అనంతపురం జిల్లా పారిశ్రామిక హబ్గా మారుతుంది. రాయలసీమ యువతకు ఇక్కడే అంతర్జాతీయ స్థాయి ఉపాధి లభిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిభ కలిగిన మన యువతకు ఈ పరిశ్రమలు ఒక వేదికగా మారుతాయని, భవిష్యత్తులో యుద్ధ విమానాల విడిభాగాలన్నీ మన రాష్ట్రంలోనే తయారయ్యేలా అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
