ఇటీవలి కాలంలో బిజెపి పార్టీ పై మాటల తూటాలు పేలుస్తూ బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ఆంధ్ర రాజకీయాలపై కూడా మాట్లాడారు. ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు మద్దతివ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.
ముందు కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాననీ, ప్రస్తుతానికి కేవలం బీజేపీ నే ప్రశ్నించినా భవిష్యత్తులో మిగతా పార్టీలను కూడా ఇలాగే ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు. ఇక జనసేనపై వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు మంచిచేయాలనే పవన్కల్యాణ్ పార్టీ పెట్టారని, పేరు కోసం,డబ్బు కోసం పెట్టలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే కావల్సినంత పాపులారిటీ, డబ్బు ఉన్నాయన్నారు ప్రకాష్ రాజ్. అయితే పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ పెట్టాక ఎంతో మంది వస్తారు కానీ ఆయన ఆలోచనపరంగా ఎంతమంది వచ్చి చేరుతారు అనేది చూడాలి అన్నారు. అలాగే ఆయన ఆలోచనలతో ఏకీభవించి కాకుండా వేరే ప్రయోజనాలు ఆశించి వచ్చే వారి గురించి జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే వలసనేతలతో కూడా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వారే పార్టీని ముంచేసే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ కి సూచనలు చేశారు ప్రకాష్ రాజ్.
పవన్ ముక్కుసూటిగా ఉంటారని, ఆయన ప్రయత్నం మంచిదేనని అన్న ప్రకాష్రాజ్, ఆయనలా పార్టీ పెట్టి తాను రాజకీయం చేయలేనని, మంచి చేయాలని వస్తున్న పవన్ను ఆహ్వానిద్దామన్నారు.