ఎన్నికల సమయంలో తాను రెండు వందల నుంచి ఐదు వందల కోట్లను తరలించానని కేసులు పెట్టబోతున్నారని ప్రెస్మీట్ పెట్టి మరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడ్చినంత పని చేశారు. అసలు ఇలాంటి కేసు ఒకటి నడుస్తోందని ఎవరికీ తెలియదు. కానీ బయటపడే ముందే తానే బయట పెడితే బాగుంటుందని ఆయన మీడియా ముందుకు వచ్చేశారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తరలిస్తున్న 8 కోట్ల రూపాయలు దొరికాయి. అవి చెవిరెడ్డివేనని అప్పుడు చెప్పుకున్నారు. ఇప్పుడు దానికి అన్ని ఆధారాలు సమర్పించామని..కానీ డబ్బులు విడుదల చేయలేదని అంటున్నారు. ఆ డబ్బుకు ఆధారాలు అన్ని ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.
తాను ప్రభుత్వ విప్ గా ఉన్నప్పుడు గిరి అని నా గన్ మ్యాన్ గా ఉండేవారు.. ఇప్పుడు గన్ మ్యాన్ గిరి ని బలవంతంగా విచారిస్తున్నారని.. డబ్బులు దొరికింది నాది అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంటే ఆ గిరి ద్వారా డబ్బులు తరలించారని చెవిరెడ్డి చెప్పకనే చెప్పారన్నమాట. 200 నుంచి 500 కోట్లు డబ్బు నేను తరలిస్తున్నారని చెప్పమంటున్నారని..కానిస్టేబుల్ గిరి ని బెదిరించి రాయించుకొని నాపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానిస్టేబుల్ గిరి ను ఐదు రోజులు టార్చర్ పెట్టారు.. మా పీఏ లను, డ్రైవర్లను, గన్ మ్యాన్ లను తీసుకొని వెళ్లి నాపై కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చెవిరెడ్డి ముందస్తుగానే తనపై పెట్టబోతున్న కేసుల వివరాల గురించి బయట పెట్టడం హాట్ టాపిక్ గామారింది. లిక్కర్ కేసులో నన్ను చేర్చాలని చూస్తున్నారని.. మద్యం వల్ల నా ఇంట్లో ఇద్దరు చనిపోయారు, మద్యం కి నేను ఎప్పటికీ దూరమని చెప్పుకొచ్చారు. మొత్తంగా లిక్కర్ సొమ్ము ఎలా రూటింగ్ అయిందో మొత్తం.. చెవిరెడ్డి ద్వారా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పంచిన డబ్బుల లెక్కలు కూడా వెలుగులోకి వస్తాయన్నమాట.