బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ జరిగింది మానవ తప్పిదం. ఎవరు చేశారో.. ఎవరి నిర్లక్ష్యమో విచారణలో తేలుతుంది. అంత మంది జనం వస్తారని ఊహించలేదా.. ఊహించినా నిర్లక్ష్యంతో ఏర్పాట్లు చేయలేదా అన్నవి బయటకు రావాల్సి ఉంది. హైకోర్టు కూడా ఈ అంశంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొంత మంది క్రికెటర్లపై ..విరాట్ కోహ్లీపై ఏడుపందుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. అసలు క్రికెటర్లకు.. ముఖ్యంగా కోహ్లీకి ఈ తొక్కిసలాట ఘటనతో సంబంధం ఏమిటి?
ఫ్యాన్స్ అంతా రావాలని కోహ్లీ పిలుపునిచ్చాడా ?
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని కోహ్లీ కోరలేదు. క్రికెట్ టీమూ కోరలేదు. వారి పని .. టీమ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎవరి దారిన వాళ్లు పోవడమే. కప్ గెల్చుకుని బెంగళూరు చిన్న స్వామి స్టేడియానికి వెళ్లాలన్న కార్యక్రమం మాత్రమే వారికి ఉంది. ఆ ప్రకారం వచ్చారు. స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. దానికి క్రికెటర్లు ఎలా బాధ్యత వహిస్తారు ?. కామన్ సెన్స్ కూడా ఉపయోగించుకుండా.. నిందలు వేయడం ప్రారంభించారు.
కోహ్లీ కెప్టెన్ కూడా కాదు.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
ఐపీఎల్ ముగియడంతో విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి లండన్ వెళ్లారు. దాన్ని కూడా తప్పు పడుతున్నారు. అతన్ని అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ఇందులో కోహ్లీ పాత్ర ఏమిటో ఎవరైనా చెప్పగలరా?. కనీసం ఆ టీమ్కు కెప్టెన్ కూడా కాదు. కోహ్లీ సూపర్ స్టార్. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారని చెప్పడానికీ లేదు. ఎందుకంటే పద్దెనిమిదేళ్లుగా కోహ్లీ బెంగళూరుకు ఆడుతూనే ఉన్నారు. వారంతా విజయోత్సవాల్లో భాగం కావడానికి వచ్చారు కానీ.. కోహ్లీ కోసమో.. లేకపోతే కోహ్లి పిలుపునిచ్చారనో రాలేదు.
అసలు నిర్లక్ష్యాన్ని దారి తప్పించేందుకే ఈ ప్రచారాలు
ఓ స్టార్ ను టార్గెట్ చేసుకుంటే పబ్లిసిటీ వస్తుందని కొంత మంది ఆశపడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే మీడియాలో వస్తుందని అనుకుంటారు. ఇది సమస్యను పక్కదారి పట్టించడానికి పనికి వస్తుంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది.. పదకొండు మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అన్నది నిజాయితీగా దర్యాప్తులో బయటకు రాకుండా చేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తూంటారు. ఏర్పాట్లతో తప్పిదాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి.. యువత కూడా ఇలాంటి వేడుకలకు హాజరయ్యే విషయంలో ఎంతో ఆలోచించాలి. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు.