రియల్ ఎస్టేట్కు అచ్చేదిన్ ఏది అంటే కరోనా కాలం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో వడ్డీ రేట్లు భారీగా తగ్గించడంతో ఆరు శాతం వరకూ దిగి వచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందింది. పెద్ద ఎత్తున లోన్లు తీసుకుని ఇళ్లు కొన్నారు. ఆ సమయంలో అటు తక్కువ వడ్డీ.. ఇటు పన్ను మినహాయింపులు కూడా కలసి వచ్చాయి. తర్వాత ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్లు పెరిగాయి. పది శాతం వరకూ వెళ్లాయి. ఇపుడు మళ్లీ ఆర్బీఐ పుణ్యమా అని.. ఏడు, ఎనిమిది శాతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక ఇల్లు కొనుగోలు చేయవచ్చా అని మధ్యతరగతి ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. తక్కువ వడ్డీ రేట్లు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కు బూస్ట్ ఇచ్చేవే. అయితే ఇది ఓ రకంగా ట్రాప్ అని కూడా మధ్యతరగతి ప్రజలు ఆలోచించాలి. అయితే ఈ ట్రాప్ ఇల్లు కొనడం కాదు. రేంజ్ పెంచుకోవడం గురించి. ఇల్లు కొనడం అనేది ఎప్పటికైనా లైఫ్ టైమ్ సెటిల్మెంట్ లాంటిది. దశాబ్దాల సేవింగ్స్.. తర్వాత మరికొన్నేళ్ల పాటు సంపాదన అంతా ఇంటికే పెట్టాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వైజ్ గా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ వడ్డీకి వస్తుంది కదా అని .. భరించలేనంత పెద్ద మొత్తం లోన్ తీసుకుని .. స్థోమతకు మించి ఇల్లు కొనడం మంచిది కాదు.
అదే సమయంలో భవిష్యత్ లో డిమాండ్ పెరిగే చోట కొనుగోలు చేయడం కూడా కీలకం. యాభై లక్షలు లోన్ తీసుకుని ఇల్లు కొన్నారంటే..దానికి ఎడెనిమిది శాతం వడ్డీ కడితే.. కనీసం పది శాతం ఆ ఆస్తి విలువ పెరిగేలా చూసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంలో మార్కెట్ రీసెర్చ్ చేయడం కీలకం. సాధారణంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట .. విలువ పెరుగుతూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాలు వంటివి చూసుకుని వచ్చే ఐదు, పదేళ్లలో ఎక్కడ బాగా పెరుగుతాయో చూసుకుని అక్కడ కొనుగోలు చేయడం ఉత్తమం.
కేవలం వడ్డీ రేట్లు తగ్గాయన్న కారణంగా ఇల్లు కొనడం కరెక్ట్ కాదు. కానీ ఇల్లు కొనాలన్న ఆలోచనలు, వనరులు ఉంటే మాత్రం ఇది మంచి సమయం అనుకోవచ్చు.