ఇల్లు అనేది చాలా మందికి డ్రీమ్. కొత్తగా ఉద్యోగం చేరిన వారికి.. ఎక్కడైనా ఉండేందుకు రూమ్ దొరకాలంటే ఎంత కష్టమో తెలుసు. ఆ కష్టాలు పడినవారు.. ఎంతో కొంత లోన్ తీసుకుని అయినా సొంత ఫ్లాట్ కొనేసుకోవాలని ఆవేశపడతారు. ఓ పదేళ్ల తర్వాత జీవితంలో స్థిరపడ్డారు అనిపించుకోవాలంటే ఇల్లు ఉండాల్సిందేనని అనుకుంటారు. ఎలా చూసినా టార్గెట్ ఇంటి దగ్గరకే వస్తుంది. మరి ఎంత ఆదాయం ఉంటే.. ఇల్లుకొనేందుకు ధైర్యం చేయవచ్చు.
ఇప్పుడు ఐటీ వర్గాల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వారికి ఉన్నంత ఆదాయం ఇతర రంగాల్లో పని చేసే వారికి ఉండదు. ఐటీ వర్గాల జీవనశైలి వేరు కాబట్టి వారిని పక్కన పెడదాం. సామాన్య ప్రజలు, ఐటీయేతర రంగాల్లో పని చేసేవారికి.. నాలుగైదేళ్లు ఉద్యోగంలో సీనియార్టీ వచ్చే సరికి నలభై , యాభై వేల జీతం వస్తుంది. ఇది ఇల్లు కొనుగోలు చేయడానికి సరిపోదు. ఎందుకంటే.. ఆర్థిక సూత్రాల ప్రకారం .. జీతంలో ఎన్ని రకాల ఈఎంఐలు అయినా సగానికి మించకుండా చూసుకోవాలి. అంటే పర్సనల్ లోన్స్ ఏమీ లేకుండా పాతిక వేలు ఈఎంఐ ఉండేలా పెట్టుకోవాలి. అలా అయితే మహా అయితే ముఫ్పై లక్షలు లోన్ వస్తుంది. అంటే డౌన్ పేమెంట్ కనీసం ఇరవై లక్షలు రెడీ చేసుకోవాలి.
ఉద్యోగంలో చేరిన తర్వాత అంత మొత్తం పొదుపు చేసుకుంటే ముందడుగు వేయవచ్చు. కానీ నేటి యువత ఆర్థిక విషయాల విషయంలో సోషల్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారు. వెంటనే స్టాక్స్ లో పెట్టుబడిపెడుతున్నారు. ట్రేడింగ్ చేస్తున్నారు. సిప్లలో పెట్టుబడులు పెడుతున్నారు. జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ మంచి పెట్టుబడులే. అయితే ఇంటికి పెట్టే పెట్టుబడులు మాత్రం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. యాభై లక్షల అపార్టుమెంట్ కొనుగోలు చేయాలని అనుకుంటే.. ముందుగా కనీసం ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకునే స్థోమత తెచ్చుకోవాలి. ఆ తర్వాత ముందడుగు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు అరవై శాతం లోన్ పెట్టుకోవడం శ్రేయస్కరం. జీతం ఎక్కువగా ఉన్నా… లోన్ ఎలిజిబులిటీ ఎక్కువగా ఉన్నా… లోన్ విషయంలో అరవై శాతం రూల్ పెట్టుకుంటే.. ముందు ముందు ఆర్థిక పరంగా కూడా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు.