‘కుబేర’ సినిమా సక్సెస్ మీట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. `సినిమా రెమ్యునరేషన్ రిలీజ్కి ముందే ఇచ్చేశారు.. అంతకంటే ఆనందం ఏముంది` అంటూ నిర్మాతల్ని ఉద్దేశించిన మాట్లాడుతూ స్టేజీపై చిన్నపిల్లాడిలా గంతులు వేశాడు దేవిశ్రీ. రాజుగారి రెండో భార్య బాగుంది అంటే.. మొదటి భార్య పరిస్థితి ఏమిటో చెప్పకనే చెప్పేసినట్టు. ‘ఈ సినిమాకు పారితోషికం అందింది’ అంటే మిగిలిన నిర్మాతలు ఎగ్గొట్టినట్టే అర్థం. ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఏం లేదు. మరి దేవిశ్రీకి అలా ఎగ్గొట్టిన నిర్మాతలెవరూ? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే టెక్నీషియన్లలో దేవిశ్రీ ఒకడు. అగ్ర నిర్మాణ సంస్థలతో పని చేశాడు. దేవిశ్రీ డిమాండ్ ఏమిటో నిర్మాతలకు తెలుసు. కథని ఓన్ చేసుకొంటే ఎలాంటి సంగీతం అందిస్తాడో కూడా తెలుసు. అలాంటి సంగీత దర్శకులకు పారితోషికంలో కోత విధించడం కష్టమే. పైగా దేవిశ్రీ చాలా ప్రొఫెషనల్. ఇలాంటి వాళ్లతో లావాదేవీలు చాలా పక్కాగా ఉంటాయి. అడ్వాన్స్ గా కొంత, మధ్యలో కొంత, రిలీజ్కు ముందు మిగిలిన మొత్తం.. ఇలా మూడు దఫాలుగా చెల్లిస్తారు.
కానీ ఇటీవల ఓ అగ్ర నిర్మాణ సంస్థ దేవిశ్రీకి భారీగా పెండింగ్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. సదరు నిర్మాణ సంస్థతో దేవికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిందని, దేవి తన అవుట్ పుట్ చాలా ఆలస్యం చేశాడని, అందుకే నిర్మాతలు తనపై గుర్రుగా ఉండేవారని, ఆ కారణంతోనే పారితోషికంలో కొంత ఆపేశారని, దాన్ని ఉద్దేశిస్తూనే దేవి ఇలాంటి కామెంట్లు చేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘పారితోషికం ఇవ్వడమే కాదు. నా పాటలూ బాగున్నాయట. నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందట’ అంటూ ఇదే వేదికపై దేవిశ్రీ మాట్లాడాడు. ఇది ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి కాదు. నిర్మాత ఫీడ్ బ్యాక్ అన్నమాట. `పారితోషికం ఎగ్గొట్టడమే కాకుండా తన పాటలు బాగోలేవని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదని సదరు నిర్మాతలు దేవికి చెప్పి ఉంటారు. అందుకే దేవి ఇప్పుడు వాళ్లపై సెటైర్ వేశాడు` అంటూ ఇన్ సైడ్ వర్గాలు గుసగులసలాడుతున్నాయి.
దేవికి ఏదీ మననసులో దాచుకోవడం ఇష్టం ఉండదు. ఇలా ఏదో ఒక సందర్భంలో లోపలున్నది కక్కేస్తాడు. అలానే తనని ఇబ్బంది పెట్టిన నిర్మాతల గురించి `కుబేర` ఈవెంట్ లో బయటపడిపోయాడు.