రియల్ఎస్టేట్ సెక్టార్ గతంలో ఇళ్లు మధ్యలో వదిలేయడం, నాసిరకం నిర్మాణాలు చేయడం, ఫేక్ రిజిస్ట్రేషన్లు వంటి వాటితో మోసం చేసేవారు. కానీ ఇప్పుడు మరింతగా తెలివి మీరిపోయారు. అసలు భూమి లేకుండానే మోసాలు చేయడం ప్రారంభించారు. ఏదో ఓ భూమిని చూపించడం.. ప్రీ లాంచ్ ఆఫర్లు, బై బ్యాక్ ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. కామన్ గా మారింది. వీటికి రెండు, మూడేళ్ల గడువు ఉంటుంది కాబట్టి అప్పటి వరకూ వారికి ఎలాంటి ఇబ్బంది రాదు. గడువు ముగిసిన తర్వాత.. బోర్డు తిప్పేస్తున్నారు. అప్పటి వరకూ మోసపోయిన వాళ్లకూ తెలియడం లేదు.
ప్రీ లాంచ్ ఆఫర్లు అంటే అసలు పునాదులు కూడా వేయకుండా ఇళ్లను అమ్మేయడం. యాభై లక్షల ఫ్లాట్.. పాతిక లక్షలకే వస్తుంది.. అని చెబితే సరే అని డబ్బులు కట్టేస్తున్నారు. కానీ ఆ పాతిక లక్షలకు ఇల్లు కాదు కదా స్థలం కూడా ఉండదు. ఇలా వేల కోట్లు వసూలు చేశారు. నాలుగైదేళ్ల కిందట వీటి జోరు ఎక్కువగా ఉండేవి. అవన్నీ మోసాలని ఇప్పుడు బయటపడున్నాయి. బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రి లాంచ్ మోసాలను నమ్మని వాళ్లను.. బై బ్యాక్ పేరుతో ఆకట్టుకుంటున్నారు మోసగాళ్లు. స్థలాలు, ఇళ్లు కాకపోతే డబ్బులు రెట్టింపు చేసి ఇస్తాం..మేమే బైబ్యాక్ చేస్తామని మోసం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ లో కొనుగోలుదారులు మోసపోతే.. అది వారి జీవితంపై ప్రభావం పడుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన సొమ్ము మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. నిందితులు దొరికినా.. వారిని జైల్లో పెడతారు కానీ.. డబ్బు రికవరీ కాదు. అందుకే కొనుగోలుదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తక్కువ ధరకు వస్తాయని అసలు ఆశపడకూడదని.. అన్నీ చూసుకునే ముందడుగు వేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.