రామ్ చరణ్ కెరీర్లో గేమ్ ఛేంజర్ సినిమా ఒక పీడకల. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా వస్తుందని ఫ్యాన్స్ కోటీ ఆశలు పెట్టుకున్నారు. దిల్ రాజు నిర్మాత కావడం, పాన్ ఇండియా ట్రెండ్కు ముందే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తీసిన శంకర్ దర్శకుడు కావడంతో ఈ ప్రాజెక్టుపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా చాలా దారుణంగా బెడసికొట్టింది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా పరాజయం ఇప్పటికీ జీర్ణం కావడం లేదు. డిజాస్టర్ రిజల్ట్ తర్వాత సినిమా గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొన్ననే సినిమా ఎడిటర్ గేమ్ ఛేంజర్ 4:30 గంటల లెంగ్త్ వచ్చిందని చెప్పారు. బడ్జెట్ కూడా హద్దులు దాటిపోయింది. ఫైనల్ ఎడిట్ విషయంలో దర్శకుడుకే క్లారిటీ లేదు.. ఇలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విషయంపై ఓపెన్గా మాట్లాడారు దిల్ రాజు. “గేమ్ ఛేంజర్ సినిమా నా చేతిలో లేకుండా పోయింది. గేమ్ ఛేంజర్ 4 గంటల 30 నిమిషాల లెంగ్త్ వచ్చిన మాట నిజమే. నిజానికి ఒక పెద్ద దర్శకుడితో సినిమా చేసిన అనుభవం నాకు లేదు. నేను ఎన్నో సినిమాలు తీశాను కానీ లెజెండరీ డైరెక్టర్ కోవకు చెందిన దర్శకులతో నేను చేయలేదు. నేను చేసిన సినిమాలన్నీ నా చేతుల్లో ఉండేవి. గేమ్ ఛేంజర్ నా చేతుల్లో లేకుండా పోయింది. ఈ విషయంలో నేను ఎవరిని నిందించడం లేదు. ఇలాంటి సినిమాని టేకప్ చేయడమే నా ఫస్ట్ మిస్టేక్. అయితే చరణ్కి అలాంటి సినిమా పడిందనే బాధ నాకు చాలా ఉంది. అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఎమోషనల్గా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? నాకు అలవాటు లేని ప్రాజెక్ట్ని ఎత్తుకోవడం నా మిస్టేక్” అని ఓపెన్గా చెప్పారు దిల్ రాజు.
`గేమ్ ఛేంజర్` ఫ్లాప్ బాధని సంక్రాంతి సీజన్ కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కాస్త తగ్గించింది. ఈ సినిమాకు ఊహించని వసూళ్లు రావడంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ బాధల్లోంచి త్వరగా బయటపడగలిగారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ స్థాయి విజయం సాధించలేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏమయ్యేదో?