శ్రీకాకుళంలో అమెరికా కంపెనీ ప్లాస్టిక్ పరిశ్రమ, విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, కర్నూలులో రిలయన్స్ బెవరేజెస్, నాయుడుపేటలో ఏషియన్ పెయింట్స్ ఇలా ఓ జాబితా రాసుకుంటే..కనీసం ఓ వంద కంపెనీల పెట్టుబడులు కార్యరూపంలోకి వచ్చిన వార్తలు ఉన్నాయి. ఇవన్నీ ఎంవోయూలు కాదు. నేరుగా పెట్టుబడుల ప్రతిపాదనలు. భూముల కేటాయింపులు. ఓ టైమ్ ఫ్రేమ్లో ఉత్పాదకత ప్రారంభించాల్సిన పరిశ్రమలు. వీటి నిర్మాణం దగ్గర నుంచి ప్రజలకు ఉపాధి ప్రారంభమవుతుంది . నిర్మాణం ప్రారంభమైన తర్వాత శాశ్వత ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతిమంగా ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు ఆర్థికంగా బలపడతాయి.
గతంలో పెట్టుబడుల తరిమివేత
పెట్టుబడుల ప్రాధాన్యం ఏమిటో తెలిసిన వారికి వాటిని ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. వచ్చిన పరిశ్రమల్లో తమకు వాటాలివ్వాలని లేకపోతే కమిషన్లు ఇవ్వాలని వేధించడం చేసేది ప్రజలపై ఏ మాత్రం బాధ్యత లేని వారు. రాష్ట్రం ఉన్నది దోచుకోవడానికి అనుకునేవారు. గతంలో వచ్చిన పెట్టుబడులను ఇలాగే వేధించి తరిమేశారు. ప్లాంట్ నిర్మాణం ప్రారంభించి మరీ జాకీ పరిశ్రమ అనంతపురం నుంచి వెళ్లిపోయింది. అక్కడ వందల మంది ఉపాధి కోల్పోయారు. ఇదొక్కటే కాదు.. అసలు చిత్తూరు ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కోసమే అంతర్జాతీయ బ్రాండ్ ను తీర్చిదిద్దిన గల్లా కుటుంబం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది.
తామే వెళ్లిపోవాలని చెప్పామనే ఘోరమైన పాలకులు వాళ్లు !
తప్పుడు రిపోర్టులు తయారు చేయించి మరీ పరిశ్రమల్ని వేధించారు. చివరికి తామే వెళ్లిపోవాలని దండం పెట్టామని సజ్జల అన్నారు. అలాంటి ఘోరమైన వ్యక్తుల చేతుల నుంచి రాష్ట్రం బయటపడింది. ఇప్పుడు చంద్రబాబు వారు చేసిన నేరాలు, ఘోరాలను మర్చిపోయేలా చేసి.. పారిశ్రామిక వేత్తల్ని ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రంపై విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చంద్రబాబు సమర్థత ఉపయోగపడుతోంది. ఏపీకి మళ్లీ పెట్టుబడుల విప్లవం వస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
ఆ భూతం మళ్లీ రాదనే ధైర్యంతోనే మరింత ఊపు
ఐదు సంవత్సరాల పాలన ఏపీకి పెద్ద మైనస్. అలాంటి పాలన మళ్లీ వస్తే.. తాము ఎలా భరించాలని ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు ఆ భూతం మళ్లీ రాదని.. గ్యారంటీ ఇస్తున్నారు. ఈ విషయంలో ప్రజలపై ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు . విధ్వంసకర శక్తులకు మళ్లీ అవకాశం ఇవ్వరనిఆయన నమ్మకం. వచ్చే నాలుగేళ్లలో ఏపీ పూర్తి స్థాయిలో మారిపోనుంది. ఇరవై లక్షలకుపైగానే యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ ఓ అవకాశాల స్వర్గథామంగా మారనుంది. దానికి ప్రజల సాకారమే ముఖ్యం.