హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. కానీ ఊహించనంతగా కాదు. రావాల్సినంత బూమ్ రావడం లేదు. మౌలిక సదుపాయాల పరంగా ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్కు తిరుగు లేదు. అందుకే హైదరాబాద్ లో స్థిరపడేందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ ఇళ్ల అమ్మకాలు ఆ స్థాయిలో ఉండటం లేదు. ఎక్కువ మంది అద్దె ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఎందుకు ఇళ్లు కొనుగోలు చేయడం లేదు అంటే.. అందరి నుంచి ఒకటే సమాధానం వస్తోంది. ధరలు చాలా ఎక్కువ అని. ఎంత ఎక్కువ అంటే.. వివిధ ప్రాజెక్టుల్లో ఎంక్వయిరీలు చేసిన వారికే దానిపై అవగాహన ఉంటుంది. ఓ హై రైజ్ అపార్టుమెంట్లో .. ప్రారంభ స్థాయి ఫ్లాట్ కొనాలంటే కనీసం రెండు కోట్లు ఉండాల్సిందే. అంత కంటే తక్కువకు రావు. ఇక సాదా సీదా బిల్డర్లు.. కట్టే నాలుగైదు అంతస్తుల అపార్టుమెంట్లలో కూడా ఏ మాత్రం తక్కువ కాదు కనీసం 70లక్షలకు అమ్ముతున్నారు. ఓ అపార్టుమెంట్ కు అంత పెట్టే మధ్యరగతి ప్రజలు ఎంత మంది ఉంటారు?
ఐటీ ఉద్యోగుల్లో ఓ స్థాయి జీతాలు అందుకునేవారిని చూసి.. మిగతా అందరూ అదే రీతిలో డబ్బులు పెడతారని ఆశించి.. రేట్లు పెంచేశారు. భూమి ధరలు కూడా అలాగే పెరిగాయి. బిల్డర్లు మార్కెట్ ఉంటుందని దానికి తగ్గట్లుగా నిర్మాణాలు చేశారు. ఇప్పుడు ఐటీ రంగంలోని వారు కూడా .. ముందూ వెనుకా ఆలోచించేంత ధరలు ఉన్నాయి. ఇక ఇతర వర్గాలు ఏం కొంటాయి?. ధరలు దిగి వస్తేనే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకునే అవకాశం ఉంటుంది.