భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గజట్ లో ప్రకటించింది . ఆర్ధిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘం లో యార్లగడ్డ మూడు సంవత్సరాలు వుంటారు. మంత్రిత్వశాఖ లో రాజభాష హిందీ కి సంబంధించి ఆయనసలహాలు ఇస్తారు. నిజానికి గత మే నెలలోనే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హిందీ సలహా సంఘం సభ్యుడి పదవి లభించింది. పది మంది సలహాదారులలో ఆయన ఒకరు. కానీ అక్కడ ఏమైనా తేడా కొట్టిందో.. లేకపోతే అదనంగా మరో సలహాదారు పదవి ఇచ్చారో కానీ.. ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ గురించి బాగాతెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హిందీ పేరుతో ఓ పదవిని అందుకోవడమే ఆయన స్టైల్. 2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో ఏ పదవీ రాలేదని ఆయన జగన్ పంచన చేరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోసం ఆయన చేసిన రచ్చ అంతా …ఇంతా కాదు. చంద్రబాబు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియా పెడితే మాతృభాషను చంపేస్తున్నారని చొక్కా విప్పదీసి చేసిన నాటకాలు ఆడారు.
జగన్ గెలిచిన తర్వాత ఆయనకు జగన్ రెడ్డి ఒకటి, రెండు పదవులు ఇచ్చారు. దాంతో జగన్ భజన బాగానే చేశారు. చివరికి తెలుగు మీడియం తీసేసినా మాట్లాడలేదు. తర్వాత జగన్ రెడ్డి పరిస్థితి దిగజారిందని తెలుసుకుని హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినప్పుడు తన కు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు కానీ… జగన్ రెడ్డిని మాత్రం పొగడటం ఆపలేదు. ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి సీన్ మార్చేశారు. కూటమికి ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రచారం చేశారో లేదో ఎవరికీ తెలియదు. తర్వాత ఇప్పుడు జగన్ మాట ఎత్తడం లేదు కానీ.. పదవులు మాత్రం కేంద్రంలో పొందుతున్నారు.