కొత్త కథలు రావడం లేదు, కొత్త సినిమాలు రావడం లేదు, తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు ఛాన్స్ లేదు…..లాంటి డైలాగులను మన తెలుగు సినిమా వాళ్ళు తరచుగా వల్లె వేస్తూ ఉంటారు. అలాంటి కొత్తదనం కోసం మేము సిద్ధంగా ఉన్నామని మాటలు మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ‘జ్యో…అచ్యుతానంద’ లాంటి మంచి స్క్రిప్ట్తో చాలా మంది యువ హీరోలను అప్రోచ్ అయ్యాడు అవసరాల శ్రీనివాస్. అందరూ కూడా ఆ కథ నచ్చింది అన్నవాళ్ళే. కానీ మల్టీస్టారర్ కథ కంటే కూడా సోలో హీరో సినిమా అయితే చెప్పు….చేసేద్దాం అని చెప్పిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మీడియా ముందు మాత్రం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి మేం సిద్ధం అని చెప్తూ ఉంటారు. యువ హీరోల పరిస్థితే ఇలా ఉంటే ఇక బడా స్టార్ హీరోల గురించి వేరే చెప్పాలా?
అయితే యువ హీరోలందరిలోనూ నారా రోహిత్ ఒక్కడు మాత్రం సంథింగ్ డిఫరెంట్. కొత్త కొత్త కథలను, వెరైటీ కథలను ప్రేక్షకులకు అందించడం కోసం తనవంతు ప్రయత్నం చే్స్తున్నాడు. హిట్స్, ఫ్లాప్స్, ఇమేజ్తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ’జ్యో…అచ్యుతానంద’ సినిమా ఇంత అందంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే కూడా ఈ నారావారి అబ్బాయే కారణం. మల్టీ స్టారర్ సినిమా అవడంతో పాటు, కొంచెం నెగిటివ్ షేడ్ కూడా ఉన్న ఆ క్యారెక్టర్ చేయడానికి వేరే ఏ హీరో అయినా ముందుకు వచ్చే అవకాశం లేదు. కానీ రోహిత్ మాత్రం మంచి సినిమాలో భాగమవ్వాలనుకున్నాడు. అందుకే నారా రోహిత్ని అభినందించాలి.
అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్తో పాటు బోలెడుమంది కొత్త ప్రొడ్యూసర్స్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు కానీ వాళ్ళలో కొంచెం తెలివితేటలు, సినిమాపైన ప్రేమ, అభిరుచి ఉన్నవాళ్ళను మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. రిజల్ట్స్ విషయం పక్కన పెడితే సాయి కొర్రపాటిగారు మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.అందాల రాక్షసి, ఈగ సినిమాల నుంచే ఆయన ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ‘జ్యో…అచ్యుతానంద’ సినిమాతో మరోసారి తన అభిరుచి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు రుచి చూపించారు. జ్యో, అచ్యుత్, ఆనంద్ల కథను టేకప్ చేయాలంటే ఆ ప్రొడ్యూసర్కి మాంచి జడ్జ్మెంట్ స్కిల్స్తో పాటు, గట్స్ కూడా ఉండాలి. కొంచెం యాంటీ సెంటిమెంట్ టోన్ కూడా ఉన్న కథ కదా. ఇక అవసరాల శ్రీనివాస్ అంటారా…..? ఒక్క అవసరాల శ్రీనివాస్ అనే కాదు…ఇంకా చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళ కలలకూ, కథలకూ తెర రూపం రావాలంటే ఒక నారా రోహిత్, ఓ సాయి కొర్రపాటి ముందుకు రావాలంతే.