టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కేసిన ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఎప్పుడూ లేని విధంగా తన తర్వాత సినిమాను ప్రారంభించడానికి కొంచెం టైం తీసుకుంటున్నాడు. వక్కంతం వంశీ కథ నచ్చక, వేరే డైరెక్టర్ ఎవరూ సెట్ అవక గ్యాప్ తీసుకుంటున్నాడని కొంతమంది చెప్పారు కానీ అసలు సమస్య కథ, డైరెక్టర్తో కాదని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు.
సింహాద్రి సినిమా తర్వాత నుంచి ఎన్ని సినిమాలు చేసినప్పటికీ…వాటిలో కొన్ని మంచి హిట్సే ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ కెరీర్కి మాత్రం హెల్ప్ అయింది ఏమీ లేదు. అంతే కాకుండా ఫ్యాన్ బేస్, మార్కెట్ స్టామినా కూడా తగ్గుతూ వచ్చింది. అందుకే టెంపర్ సినిమా నుంచి సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. సినిమా సినిమాకు తన మార్కెట్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే సుకుమార్తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా చేస్తూ ఉండగానే క్లాస్తో పాటు మాస్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా సినిమాలు తీయగల సామర్థ్యం ఉన్న కొరటాలను కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమాను తనతోనే తీసేలా ఒప్పించుకున్నాడు. ఎన్టీఆర్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ హిట్ కొట్టలేకపోయినప్పటికీ జనతా గ్యారేజ్ సినిమా బాగానే కలిసొచ్చింది. రిలీజ్కి ముందు నుంచి కూడా జనతా పైన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఎన్టీఆర్…జనతా తర్వాత చేయబోయే సినిమా అంతకుమించి అనేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చినప్పటికీ, కొత్త డైరెక్టర్ అంటే బిజినెస్ రేంజ్ తగ్గిపోతుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేశాడు. తెలుగు, తమిళ్ మార్కెట్స్ని టార్గెట్ చేసి లింగుస్వామితో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. పూరీ జగన్నాథ్తో కలిసి తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉండేలా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ని ప్లాన్ చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు ఎన్టీఆర్. బిజినెస్ మేన్ సినిమాను ఆ రేంజ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు పూరీ.
కానీ అప్పుడు వర్కవుట్ అవలేదు. ఎన్టీఆర్ కనుక అవకాశం ఇస్తే సినిమాను ఆ రేంజ్లో ప్లాన్ చేస్తానని పూరీ చెప్తున్నాడట. అందరూ అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్లో తెరకెక్కనున్న సినిమాను తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసే ఉద్ధేశ్యమైతే తారక్కి లేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్కి మంచి గుర్తింపు వచ్చేలా చేయడం కోసం భారీ బడ్జెట్ సినిమానే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం అయితే లింగుస్వామికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.