తెలుగు చిత్రసీమ తట్టుకోలేని డిజాస్టర్లు ఇచ్చిన ఘనత మెహర్ రమేష్. కంత్రి, శక్తి, షాడో.. ఇలా మెహర్ కళాఖండాలు తీశాడు. శక్తి, షాడో అయితే.. మాటల్లేవ్ ఇక! షాడో తరవాత మెహర్ పేరు తలచుకోవడానికే భయం వేసింది. మెహర్ కూడా సీరియస్గా ప్రయత్నాలు చేయలేదు. ఆ మాటకొస్తే ఎవ్వరికీ కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ స్ర్కిప్టు పట్టుకొని తిరుగుతున్నాడని టాక్. ఓ కథ రాసి, స్టార్ హీరో డేట్ల కోసం వెంట పడుతున్నాడట. మెహర్తో ఇది వరకు పరిచయం ఉన్న హీరోలు కొంతమంది ఓపిగ్గా కథ వింటున్నా.. మిగిలిన వాళ్లు మెహర్కు అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. అయితే మెహర్ ఇప్పుడు అశ్వనీదత్ దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్తో తీసిన శక్తి సినిమాకి నిర్మాత దత్నే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ సినిమా తీసి పెడతా.. అంటున్నాడట.
కథ విన్న దత్ కూడా ఈ ప్రాజెక్టుపై నమ్మకం పెంచుకొన్నాడని ‘సరిగ్గా తీస్తే హిట్టు గ్యారెంటీ’ అని ఆయన కూడా ఈ సినిమాపై మోజు పడుతున్నాడని టాక్. దర్శకుడు, కథ, నిర్మాత రెడీ అయిపోతే హీరో దొరికేయడం సులభమే. అయితే ఈ కథ ఓ స్టార్ హీరోని డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే స్టార్ హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. దానికి తోడు మెహర్ ట్రాక్ రికార్డు చూస్తే… ఆ సాహసం చేయడానికి ముందుకు రాకపోవొచ్చు. అందుకే మినిమం రేంజున్న హీరోతో సర్దుకుపోవాలని భావిస్తున్నాడట. సాయిధరమ్తేజ్, వరుణ్ తేజ్, గోపీచంద్ వీళ్లలో ఒకరితో మెహర్ సినిమా మొదలయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. అయితే వీళ్లు కూడా ఒప్పుకొంటేనే. చూశారా.. ఈ డిజాస్టర్లు ఎంత పని చేశాయో?? చేతిలో మంచి కథ ఉన్నా హీరో దొరకడం లేదు. బ్యాడ్ లక్ అంటే ఇంతే మరి.