రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ వివాదంలోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అలవాటులో పొరపాటో ఏమో కానీ, ఒక నిండు సభ వేదికపై అనరాని మాట ఆయన నోటి నుండి తడబాటుగా వచ్చింది. ఈ విషయంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎవ్వరూ కూడా ఆయన్ని సమర్థించడం లేదు. ఆ మాటలో ఉద్దేశం లేకపోయినప్పటికీ, సభలో మాట్లాడాల్సిన మాట అది కాదు.
అయితే, ఈ మొత్తం వివాదంలో అలీ గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వివాదంపై ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప ఆర్టిస్ట్. ఆయన తన కుమార్తెను కోల్పోయిన విషయం మనందరికీ తెలుసు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. పొరపాటున ఆయన నోటి నుంచి ఆ మాట తూలింది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి” అని కోరారు.
ఈ విషయంలో అలీని అభినందించాలి. వయస్సు రీత్యా రాజేంద్ర ప్రసాద్ మాట జారిపోయి ఉండవచ్చు. దాన్ని అర్థం చేసుకొని అలీ స్పందించిన తీరు ప్రశంసనీయం. అటు రాజేంద్ర ప్రసాద్ కూడా సభా మర్యాద పాటించాల్సిన అవసరం ఉంది. స్నేహం, వాత్సల్యంతో సరదాగా మాట్లాడే ముందు, అది మీడియా ద్వారా ప్రజల్లో ఎలా ప్రచారంలోకి వస్తుందో గ్రహించి మాట్లాడటం మంచిది.