రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా రక్షణ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ఉద్యాన వనాలకు నిలయమైన సీమ, ఇకపై దేశ రక్షణకు వెన్నెముకగా నిలుస్తూ రక్షణ సీమ గా అవతరించనుంది. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు, భారతదేశపు మొట్టమొదటి 5th Generation స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రంగా నిలవబోతోంది.
ఈ భారీ డిఫెన్స్ ప్రాజెక్టుతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా మరో 12 కీలక ప్రాజెక్టులకు కూడా భూమి పూజ జరగనుంది. రక్షణ , డ్రోన్ రంగాల్లో రానున్న ఈ పరిశ్రమల ద్వారా అదనంగా రూ. 4,145 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఎనిమిది డ్రోన్ తయారీ సంస్థలు తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి. దీనివల్ల దాదాపు 13,500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్గా ఎదగనుంది. ఈ డ్రోన్ సిటీలో ఎనిమిది కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనుండటం వల్ల రాయలసీమ ప్రాంతం సాంకేతిక నైపుణ్యానికి కేంద్రంగా మారనుంది. కేవలం ప్రధాన ప్రాజెక్టుల ద్వారానే కాకుండా, వీటికి అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా భవిష్యత్తులో మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధిని కల్పించనుంది. శుక్రవారం ఉదయం 10:15 గంటలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ శంకుస్థాపన వేడుకలు ప్రారంభమవుతాయి.
