కూకట్ పల్లిలో సొంత స్థలం కొనాలన్న ఆలోచన ఉన్న వారికి మరో అవకాశం ఎదురుగా వచ్చింది. అత్యంత డిమాండ్ ఉన్న కూకట్ పల్లి ఏరియాలో మరో 23 స్థలాలను వేలం వేసేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో కొన్ని కమర్షియల్ స్థలాలు కూడా ఉన్నాయి. జూన్ 23న వేలం జరుగుతుంది. కమర్షియల్ స్థలానికి రేటు ఎక్కువగా నిర్ణయించారు. చదరపు గానికి లక్షా ఇరవై వేలు, నివాస స్థలాలకు గజం యాభై వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు.
ఈ వేలంలో పాల్గొనడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. వేలంలో పాల్గొనేవారు పది లక్షల రూపాయలు రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. వేలం జరిగే రోజు అంటే 23వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకూ డీల్ సమర్పించడానికి సమయం ఉంది. వేలంలో స్థలం దక్కించుకోకపోతే ఆ మొత్తం తిరిగి ఇస్తారు. గత వారం కూకట్ పల్లిలోనే ఇరవైకిపైగా స్థలాలను వేలం వేలం వేశారు. అత్యధికంగా గజం మూడు లక్షల వరకూ పలికింది. అత్యల్పంగా లక్ష వరకూ వేలంలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ సారి కూడా వేలంలో గజం కనీసం లక్ష రూపాయల వరకూ నివాస స్థలాలు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. కూకట్ పల్లి ఇప్పుడు హైదరాబాద్లోనే అత్యధిక ధర పలికే ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఐటీ కారిడార్కు సమీపంలో ఉండటంతో ఇక్కడ నివాస స్థలాలు, అపార్టుమెంట్లు హాట్ ప్రాపర్టీలుగా మారాయి.