డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జూలై 7 వరకు ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే కోర్ట్ ముందు ఎలాంటి దాపరికం లేకుండా అన్ని నిజాలు ఒప్పుకున్నాడు శ్రీరామ్. ఆయన డ్రగ్స్ను అలవాటు చేసుకున్న విధానం చూస్తే షాక్ అనిపిస్తుంది.
అన్నాడీఎంకే మాజీ లీడర్ ప్రసాద్ ఆయనకు డ్రగ్స్ అలవాటు చేశారట. ఆయన నిర్మాణంలో ‘తీంగిరై’ అనే సినిమాలో నటించాడు శ్రీరామ్. అప్పట్లో ఆయన పారితోషికంగా రూ.10 లక్షలు ఇవ్వాలి. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా కొకైన్ ఇచ్చేవాడట ప్రసాద్. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి దానికి బానిసైపోయిన శ్రీరామ్ ఇక అక్కడ్నుంచి వాడకం మొదలుపెట్టినట్లు కోర్టుకు వివరించాడు.
మత్తుపదార్థాలు వాడి తప్పు చేశానని, తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరాడు శ్రీరామ్. ఇందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. నార్కొటిక్స్ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని అదేశించారు. అనంతరం శ్రీరామ్ను పుళల్ జైలుకు తరలించారు.
తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శ్రీరామ్, శ్రీకాంత్ పేరుతో కూడా సుపరిచితం. తెలుగులో ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘నిప్పు’ వంటి చిత్రాల్లో కనిపించాడు. ఈ మధ్యనే ‘పిండం’ అనే హారర్ సినిమా చేసిన శ్రీరామ్.. ఇప్పుడు ఇలా మత్తుకు బానిసై జీవితాన్ని భయానకంగా మార్చుకున్నాడు.