యూపిలో అధికార సమాజ్ వాది ప్రభుత్వంలో రాజుకొన్న చిచ్చుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ ఆర్పివేసినట్లే ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గ విస్తరణ చేశారు. దానిలో ముగ్గురు కొత్త మంత్రులతో సహా గాయత్రి ప్రజాప్రతికి కూడా చోటు దక్కింది.
విశేషమేమిటంటే, గాయత్రి ప్రజాప్రతిపై అవినీతి ఆరోపణలు రుజువు అవడంతో అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆయనని కొన్ని రోజుల క్రితమే మంత్రి పదవిలో నుంచి తొలగించారు. తద్వారా తను అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించబోనని, తన ప్రభుత్వం చాలా పారదర్శకంగా, నీతివంతంగా పరిపాలన చేస్తోందని రుజువు చేసుకొనేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఇప్పుడు తను తొలగించిన ఆ అవినీతిపరుడినే మంత్రివర్గంలోకి తీసుకోవలసిరావడంతో ప్రజలకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
గాయత్రి ప్రజాప్రతిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకొనేలా చేసి ములాయం సింగ్ యాదవ్ పార్టీపై, కొడుకు ప్రభుత్వంపై తన ఆధిపత్యం నిరూపించుకోగలిగారు. పైగా పార్టీకి అధ్యక్షుడుగా తన తమ్ముడు శివపాల్ యాదవ్ ని నియమించడంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అడ్డుగీత కూడా గీసినట్లయింది. ఆ కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయం కొరవడి దేని దారి దానిదేనన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పరిణామాలు వలన తన కొడుకుకి, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు ఏర్పడుతుందని పెద్దాయన (ములాయం సింగ్ యాదవ్) గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.