విశాఖపట్నం ఉత్తర కారిడార్లో కాపులుప్పాడ ఐటీ సెజ్ విస్తరణ , భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకోవడం రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆనందపురం నుంచి భోగాపురం వెళ్లే దారిలో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ ఇప్పుడు హాట్ కేక్ లా మారింది.
కాపులుప్పాడ ఐటీ సెజ్లో కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. దాదాపు 20,000 కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా జరుగుతున్న ఈ విస్తరణ, ఐటీ నిపుణులను ఆకర్షిస్తోంది. వీరికి నివాస వసతులు కల్పించే క్రమంలో ఆనందపురం చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు వెలుస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వంటి మెగా ప్రాజెక్టులు తర్లువాడ సమీపంలో వస్తుండటంతో, ఐటీ ఉద్యోగులు ఈ కారిడార్లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు.
జూన్ 30, 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం మొదటి దశ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఇన్వెస్టర్లలో భరోసా పెరిగింది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, కేవలం రవాణా వ్యవస్థే కాకుండా దాని చుట్టూ ఏరోసిటీ అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఆనందపురం నుంచి భోగాపురం వెళ్లే 6 వరుసల రహదారికి ఇరువైపులా ఉన్న భూముల ధరలు గత ఆరు నెలల్లోనే 30% నుంచి 40% వరకు పెరిగాయి. విమానాశ్రయం ప్రారంభమయ్యాక ఈ వృద్ధి మరింత వేగంగా ఉంటుందని మార్కెట్ అంచనా.
రియల్ ఎస్టేట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడ గజం ధర రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య పలుకుతోంది. ఐటీ సెజ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడం, విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ నడవడం వంటివి వచ్చే రెండేళ్లలో జరగనున్నాయి. ఈ మౌలిక సదుపాయాలు పూర్తయ్యేసరికి ఇక్కడ భూమి లభ్యత తగ్గి, డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వారికి వచ్చే 3 ఏళ్లలో 80% నుంచి 100% అంటే డబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ టాక్ వినిపిస్తోంది.
