ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి కేవలం పరిపాలనాపరమైన క్రమశిక్షణే కాకుండా, త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళన కు బలమైన సంకేతంగా కనిపిస్తోంది. ఇటీల కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు మీడియాకు చేరడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలుసు అని ఆయన అనడం వెనుక.. సదరు మంత్రులపై ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ఆయనకు నివేదికలు అందాయని స్పష్టమవుతోంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బడ్జెట్ వివరాల లీకేజీపై మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన ఉదంతాన్ని గుర్తు చేయడం ద్వారా.. పనితీరు మార్చుకోని పక్షంలో ఉద్వాసన తప్పదనే హెచ్చరికను ఆయన బలంగా పంపారు.
రెండేళ్ల గడువు – పనితీరుకు గీటురాయి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న తరుణంలో, ఇది మంత్రివర్గ మార్పులకు సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రుల పనితీరుపై ఆయన వద్ద ఇప్పటికే 1, 2, 3 రేటింగ్స్ ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు సాధించలేకపోయిన వారు, శాఖా పరమైన అంశాలపై అవగాహన లేని వారు , వివాదాల్లో చిక్కుకున్న మంత్రులను ఈసారి తప్పించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువతకు అవకాశం ఇవ్వాలని బాబు యోచిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వ్యూహం
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు తన కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీని ఉరకలెత్తించే చురుకైన నేతలకు, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యత దక్కని వర్గాలకు ఈ ప్రక్షాళనలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉన్న రాజకీయ అసమతుల్యతను సరిచేయడానికి కేబినెట్ విస్తరణ ఒక ఆయుధంగా మారనుంది.
లోకేష్, పవన్ ప్రభావం
ఈ విడత మార్పుల్లో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువ నేతలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో కొందరు సీనియర్లను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసే అవకాశం ఉంది. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ కూటమిలోని ఇతర నేతలకు కూడా ప్రాతినిధ్యం పెంచడం ద్వారా 2029 ఎన్నికల వరకు బలమైన పునాది వేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో ఉన్నారు. కేబినెట్ ఎజెండా లీక్ అవ్వడం అనేది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అందుకే, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి, ఎవరైతే అధికారులపై పట్టు సాధించలేకపోయారో వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
