విద్యార్థులకు స్కూల్స్ తెరిచిన రోజే తల్లికి వందనం డబ్బులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభవ హామీని కూడా ఈ నెలలోనే నెరవేర్చాలని నిర్ణయించుకుంది. అన్నదాతా సుఖీభవ కింద రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ. 20 వేలు ఖాతాల్లో జమ చేయాలని నిర్మియంచారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం పధ్నాలుగు వేలు ఇస్తోంది. అంటే తేడా రూ.6,500. మూడు విడతల్లో నాలుగువేలకుపైగా ఒక్కో విడతలో జమ అయ్యే అవకాశం ఉంది.
67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేలకోట్లకుపైగా జమ చేశారు. వీరిలో 29.82 లక్షల మంది బీసీలు, 11.76 లక్షల మంది ఎస్సీలు, 4.26 లక్షల మంది ఎస్టీలు, 66 వేల మంది మైనార్టీలు ఉన్నారు. 8.44 లక్షల మంది ఈడబ్యూసీ విద్యార్థులు ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ ఉన్న విద్యార్ధులు 18,55,760 మంది, ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉన్న విద్యార్ధులు 29,10,644 మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉన్న విద్యార్ధులు 6,32,052 మంది ఉన్నారు. నలుగురు పిల్లలున్న తల్లులు 80,212 మంది ఉన్నారు. వీరందరికీ డబ్బులు జమ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఉచితంగా మూడు సిలిండర్లకు నిధులు ఇస్తున్నారు. మత్స్యకారులు లక్షా 29 వేల 178 మందికి రూ.259 కోట్లు జమ చేశారు. పింఛన్లు కింద గత పాలకులు ఏడాదికి రూ.21, 631 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఏడాదిలో ఖర్చు చేసింది. అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు అమలు చేస్తే.. సూపర్ సిక్స్ లోని ప్రధాన హామీల్ని అమలు చేసినట్లే.