ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ నాయక్, ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, శారీరక హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అరెస్టు చేసినా సాంకేతిక కారణాలతో పట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించడంతో పోలీసులు అరెస్టు వారెంట్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడు వారెంట్ రావడంతో ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో పాటు చట్టపరమైన ప్రక్రియకు సహకరించడం లేదన్న కారణంతో ధర్మాసనం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాగా, సునీల్ నాయక్ అరెస్టు జరిగితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు సంస్థలు అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నాయి.


