నందమూరి బాలకృష్ణ, నయనతార… మంచి కాంబినేషన్. శ్రీరామరాజ్యం, సింహా, జై సింహా.. ఇలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ అభిమానుల్ని అలరించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడీ చూడబోతున్నాం.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. సినిమాలో కథానాయికగా నయనతారని ఎంచుకొన్నారు. ఇటీవలే దర్శకుడు గోపీచంద్ మలినేని నయనతారని కలిసి కథ చెప్పారు. నయనతారకు ఈ కథతో పాటు, తన పాత్ర కూడా బాగా నచ్చిందని, వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. సాధారణంగా బాలయ్య సినిమాల్లో ఇద్దరు ముగ్గురు నాయికలు ఉంటారు.. ఈ సినిమాలో కూడా మరో నాయిక ఉండే అవకాశం వుంది. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
నవంబరు 7న షూటింగ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. బాలయ్య – గోపీచంద్ కాంబోలో వీర సింహారెడ్డి సినిమా వచ్చింది. సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ అయ్యింది. వీర సింహారెడ్డి ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం. ఈసారి కూడా గోపీచంద్ యాక్షన్ కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది.
