ఏమిటట, బిహార్ గొప్ప ?

బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే, ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రానికి లక్షా25వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారన్నవిషయంలో ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరమేలేదు. అయితే, ఏదో ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినంతమాత్రాన ఏకంగా ఇంతపెద్ద ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది అసలు ప్రశ్న. ఇలా దేశంలోని ఏ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినా, ఆ రాష్ట్రానికి ఇంత భారీమొత్తంలో మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారా అన్నది మరో ప్రశ్న. బిహార్ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుండబట్టే ఆ రాష్ట్రానికి ఎన్నికలనగానే కేంద్రంలో రూలింగ్ పార్టీ అయిన బీజేపీ తనపట్టు సంపాదించుకోవడానికి నడుంబిగించింది. దేశరాజకీయాలను అతిపెద్ద స్థాయిలో ఇంతవరకూ ప్రభావితం చేసిన బిహార్, మరోసారి అలా చేయదన్న గ్యారెంటీలేదు. అందుకనే మోదీ తన చాణక్యనీతిని ప్రదర్శించారు.

రెండో ప్రశ్నకు సమాధానం – మిగతా రాష్ట్రాలకు ఎన్నికలు వస్తే మోదీ ఇలాంటి భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించరు. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక ప్యాకేజీ విషయమే నానుస్తున్న మోదీ మొన్నీమధ్యనే పట్నాలో బహిరంగసభలో బిహార్ కు ఎవ్వరూ ఊహించని రీతిలో ప్యాకేజీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటుగా ఆర్ధిక ప్యాకేజీ కావాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ ఆర్థంచేసుకోదగినదేకానీ, అది మోదీ ప్రయారిటీ క్రమంలో ఉన్నదాలేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. సరే, ఈ విషయం పక్కనబెడితే, దేశరాజకీయాల్లో బిహార్ గొప్పేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జయప్రకాష్ నారాయణ్ శకం

ముందుగా ఓ పెద్దాయన్ని మనం స్మరించుకోవాలి. బిహార్ రాజధానిలో ఉన్న ప్రభా-జయప్రకాష్ స్మారక మ్యూజియం ను సందర్శించుకోవాల్సిందే. ప్రజల హీరో జయప్రకాష్ నారాయణ్ ఆయన భార్య ప్రభా ప్రభావతి దేవిల స్మారక మ్యూజియం అది. దీని గురించి ఎందుకు గుర్తుచేయాల్సి వస్తున్నదంటే, బీహార్ రాజకీయాలనేకాదు, ఏకంగా దేశ రాజకీయాలను సంచలనాత్మక మలుపుతిప్పిన మహావ్యక్తి జయప్రకాష్ నారాయణ్. అక్కడి ప్రజలపై ఇప్పటికీ జెపీ ప్రభావితం చూపుతునే ఉన్నారు. స్వాతంత్ర్యసమరయోధుడు అయిన జేపీ ఏకంగా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీనే మూడుచెరువుల నీళ్లు తాగించారు. ఎమర్జెన్సీ తర్వాత పెనుఉప్పెనలా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి ఈ సారథ్యమే మూలకారణం. దీంతో తొలిసారి దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం స్థాపించబడింది.

ఇది జరిగి నాలుగుదశాబ్దాలైనా ఈ సంఘటన బిహార్ మీద ప్రభావితం చూపుతూనే ఉంది. ఇప్పటికీ జేపీ స్ఫూర్తి ఆరాష్ట్రంలో చెక్కుచెదరలేదనే అనిపిస్తోంది. బిహార్ ఎన్నికల సందర్భంగా అందరిలోనూ ఇప్పుడు ఒకటే ప్రశ్న. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందా? లేక, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందా?

నవంబర్ 29తోప్రస్తుత అసెంబ్లీ గడువుముగుస్తుంది. ఈలోగా బిహార్ కు ఎన్నికలు జరగాల్సిఉంది. అయితేచాలా ముందునుంచే అక్కడ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కొత్త కూటమిలు పుట్టుకొచ్చాయి. రాజకీయ పండితులు సైతం కచ్చితంగా ఫలితం ఇలా ఉంటుందని చెప్పలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. 243 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరుగుతాయి.

చాణక్య నీతి

మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుందేమోకానీ, ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మేలు అంతగా జరగకపోవచ్చు. ఈ ప్యాకేజీ ప్రకటించిన భారీ సభలోనే మోదీ ఒక మాట అన్నారు. `బిహార్ ప్రజలు చాలా తెలివైనవారు. చాణక్యుడు పుట్టిన నేల ఇది…’ అని.

నిజమే, బిహార్ ప్రజలు చాలా తెలివైనవారని గతంలో అనేకసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా ప్యాకేజీని ఈ తెలివైనవాళ్లు ఉపయోగించుకుంటారు, కానీ ఎన్నికల్లో చాణక్యనీతినే పాటిస్తారేమో అన్న అనుమానాలు బీజేపీనేతల్లోనే కనబడుతోంది. అందుకే దొంగదెబ్బతీయాలన్న ఆలోచనల్లో బీజేపీ పడింది. కోశీ ప్రాంతంలో పప్పూయాదవ్ ని ఓ అస్త్రంగా ఉపయోగించుకుని లోకికవాద ఓట్లు చీల్చాలని కుట్రపన్నుతోంది. నితీశ్, లాలూ ఇంకా కాంగ్రెస్ వాదులు అంతా కలిసి బీజేపీ అనే మతపరమైన పార్టీని కట్టడిచేయడంకోసం లౌకిక అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.

పోరాటాల భూమి

బిహార్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత అక్కడ పొడచూపింది. ఉన్నత కులాల ఆధిపత్యాన్ని ఎదుర్కునే సత్తా సంపాదించుకున్నారు. భూపోరాటాలు జరిగాయి. భూసంస్కరణలకు బాటలుపడ్డాయి. 1967కి వచ్చేసరికే కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల అవసరాన్ని ప్రజలు గుర్తించారు. అందుకు తగ్గ రాజకీయ వ్యూహాలు రచించారు. విద్యార్థుల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసహనం పెరిగింది. లాలూప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీవంటివారు అప్పట్లో విద్యార్థి సంఘాల నాయకులుగా ఉండేవారు. పట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమాన్ని జేపీ ఉత్సాహపరిచారు. ఇంతలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ తర్వాత జనతాపార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో బిహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అదేసమయంలో బిఎన్ మండల్ తన నివేదికను సమర్పించారు. విద్యాసంస్థల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ సిఫార్స్ చేసింది.

ఇంతలో మావోయిస్టులు మరోపక్క పేదలకు భూములు ఇప్పించాలనీ, కుల వివక్ష నశించాలంటూ ఉద్యమించారు. మావోయిస్ట్ తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. భూస్వాముల ఊచకోతలు మామూలైపోయాయి. బలహీనవర్గాల రాజకీయ వ్యూహాలు తెరమీదకు వచ్చాయి. లాలూప్రసాద్ యాదవ్ చురుగ్గా స్పందించారు. `యాదవులు, వెనుకబడిన తరగతుల చేతుల్లోకి అధికారమ’న్న నినాదంతో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక లాలూ పాలన కూడా అస్తవ్యస్థంగా మారింది. సామాన్యుల జీవనం మెరుగుకాలేదు. ఈలోగా అనేక ఆరోపణలు, శాంతిభద్రత సమస్యలను లాలూ ఎదుర్కోవాల్సివచ్చింది. చివరకు పతనం తప్పలేదు.

2005కి వచ్చేసరికి, బిహార్ లో మార్పు చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బిజేపీతో జట్టుకట్టి అసాధారణ విషయాన్ని సాధరణంచేసి చూపించారు. 2010లోనూ వరుసుగా రెండోసారి నితీశ్ బిజేపీ విజయం సాధించగలిగింది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో కులప్రాధాన్యత తగ్గినట్టు అనిపిస్తోంది. సరైన కూటమి ఉంటే గెలుపు మనదే అన్న వాదన పుట్టుకొచ్చింది.

లోక్ సభఎన్నికల్లో మోదీ మంత్రం బిహార్ లో కూడా ఫలించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ గెలుస్తుందా ? లేక కొత్త లౌకికవాద కూటమిలు గద్దెనెక్కుతాయా ? అన్నది తెలివైన బిహార్ ప్రజలే నిర్ణయిస్తారు. 1990వరకూ కాంగ్రెస్ ను గద్దెదింపడమే వారి ధ్యేయమైంది. ఆ తర్వాత లాలూని కిందకు త్రోసేశారు. ఇక ఇప్పుడు ఏ దారి మంచిదో వారే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వారు చాణక్యుడు పుట్టిన నేలపై వారు ఉన్నారు కనుక.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close