సున్నితమైన విషయాలపై దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలి. ఉంటుంది కూడా. మరి రాజకీయం ఏం చేస్తుంది ?. ఆ ఏకత్వాన్ని ఎప్పటికప్పుడు విభజించడానికి ప్రయత్నిస్తుంది. బాధ్యతగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఆ యుద్ధంతో రాజకీయం చేసి.. దేశ ప్రజల మధ్య అనుమానాలను రేకెత్తిస్తూంటారు. శత్రు దేశానికి కొత్త ఆయుధాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరి యుద్ధంతో రాజకీయం చేస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ మార్కెటింగ్ ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ సింధూర్ భారీ విజయం సాధించిందని చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ బహిరంగసభల్లో పాల్గొంటూ.. తన వీరత్వాన్ని చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ తోలు వలిచామని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను త్వరలో కలిసేపుసకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. మోదీతో పాటు బీజేపీ నేతలందరూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మా ఘనతేనని ప్రజల మనసుల్లోకి చొప్పించేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు.
భారత్ కు జరిగిన నష్టమేంటో చెప్పాలంటున్న కాంగ్రెస్
బీజేపీ ప్రచారంతో కాంగ్రెస్ కు కోపం వస్తోంది. తాము కూడా సంపూర్ణ సహకారం ఇచ్చినా… ఆపరేషన్ సింధూర్, సైనిక విజయాలపై రాజకీయ ప్రచారం చేసుకోవడం ఆ పార్టీకి నచ్చలేదు. అందుకే రాఫెల్ జెట్స్ ను భారత్ కోల్పోయిందని.. వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసి. ఎంతో గొప్పగా ప్రచారం చేసిన రాఫెల్ జెట్లను భారత్ ఎందుకు కోల్పోయిందో .. ఎన్ని కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి తాజాగా రేవంత్ తోడయ్యారు. అయితే వారి వ్యాఖ్యలను బీజేపీ దేశానికి వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. సైన్యం విజయాలను తమ విషయాలుగా చెప్పుకుంటున్న బీజేపీ….జరిగిన నష్టాన్ని చెప్పాలని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ ను పాకిస్తాన్ గాటన పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తోంది.
యుద్ధం రాజకీయ అంశం కాకూడదు !
దేశానికి సంబంధించిన అత్యంత క్లిష్టమైన వ్యవహారంలో రాజకీయం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మేలు జరగదు. పైగా నష్టం జరుగుతుంది. సైన్యం సాధించిన విజయాలు, కోల్పోయిన అంశాల పట్ల వీలైనంత వరకూ గోప్యత పాటించి.. ముందు ముందు వాటి నుంచి సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంది. ఇలా రాజకీయాలు చేయడం వల్ల దేశానికి నష్టం జరుగుతుంది.