తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం అంశం మరోసారి అగ్గి రాజేసింది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడమే కాకుండా, తమిళ గడ్డపై రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి.
డీఎంకే దూకుడు – టీవీకే మౌనం
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ విషయంలో అటు డీఎంకే మిత్రపక్షాలు మద్దతు తెలుపుతుంటే, కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ మాత్రం వ్యూహాత్మక మౌనం వహించడం చర్చనీయాంశమైంది. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే తక్షణమే స్పందించకపోవడం, కనీసం ఖండించకపోవడాన్ని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. దీంతో తనపై పడుతున్న హిందూ వ్యతిరేకి ముద్రను చెరిపేసుకునేందుకు, తాము హిందువులకు వ్యతిరేకం కాదని, కేవలం బలవంతపు హిందుత్వ కు మాత్రమే వ్యతిరేకమని టీవీకే ఇస్తున్న వివరణలు ప్రజల్లో మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
బీజేపీకి అందివచ్చిన రాజకీయ అస్త్రం
సనాతన ధర్మంపై డీఎంకే చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి పెద్ద రాజకీయ అస్త్రంగా మారాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. డీఎంకే ప్రభుత్వం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని, అసెంబ్లీని విద్వేష ప్రసంగాలకు వేదికగా మార్చుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం ద్వారా తమిళనాడులో హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసేందుకు బీజేపీకి గొప్ప అవకాశం లభించినట్లయిందని భావిస్తున్నారు.
హిందుత్వ వర్సెస్ హిందుత్వేతర రాజకీయాలు
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ జాతీయవాదం అన్నట్లుగా సాగిన పోరు, ఇప్పుడు హిందుత్వ వర్సెస్ హిందుత్వేతర రాజకీయాల వైపు మళ్లుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అన్నామలై చూపిస్తున్న దూకుడు, రాష్ట్రంలో కొత్త పోలరైజేషన్ దారితీస్తోంది. అటు ఆధ్యాత్మిక రాజకీయాల గురించి మాట్లాడే విజయ్, ఇటు నాస్తిక వాదాన్ని భుజాన వేసుకున్న డీఎంకే.. ఈ ఇద్దరూ ఇప్పుడు సనాతన ధర్మం విషయంలో ఇరకాటంలో పడ్డారని, ఇది అంతిమంగా బీజేపీకి మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని బీజేపీ వదిలి పెట్టేలా కనిపించడం లేదు.
