ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాం ఓ కేస్ స్టడీ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాణిక్యం ఠాగూర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఓ పాలకుడు దోపిడీని చేయడానికి అధికారుల్ని, వ్యవస్థల్ని, యువతను ఎలా ఉపయోగించుకున్నారు? బహిరంగంగా జరుగుతున్నా .. కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోలేదు ?. ఇప్పుడు జరుగుతున్న విచారణ కూడా దొంగల్ని పట్టుకునేలా ఉందా ? అన్న అంశాలపై ఆయన సమగ్రమైన ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ సామాన్యులకు ఉన్నవే. కేసు కొలిక్కి రావాలంటే బీజేపీనే కీలకం.
లిక్కర్ స్కామ్ బహిరంగ దోపిడీ
ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది బహిరంగ లిక్కర్ స్కామ్. పేద ప్రజల డబ్బుల్నే కాదు.. ఆరోగ్యాన్నీ దోచుకున్న స్కామ్ అది. ప్రధానమైన బ్రాండ్లను ఏమీ అమ్మకుండా చేశారు. తమ సొంత బ్రాండ్లు అమ్మారు. ఎంత అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. తయారీ, సరఫరా, అమ్మకం సహా మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నారు. అన్ని చోట్లా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఈ స్కామ్ నేరుగా జరుగుతున్నా… నగదు రూపంలో సేకరిస్తున్న వందలు, వేల కోట్ల డబ్బు వివిధ మార్గాల్లో తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఢిల్లీలో కావాల్సినంత మద్దతు ఇస్తూ వైసీపీ ఇక్కడ దోపిడీకి పాల్పడింది. బీజేపీ అందుకే చూస్తూ ఉండిపోయింది.
కూటమి ప్రభుత్వం రావడంతో విచారణ – కానీ బీజేపీ సహకారం ఎంత ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత పాలసీని రద్దు చేసి.. మళ్లీ మద్యం పాత విధానాన్ని తెచ్చారు. ఇప్పుడు అంతా పారదర్శకంగా జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో జరిగిన దోపిడీపై సిట్ విచారణ జరుపుతోంది. అయితే ఇప్పుడు ఇది చిన్న నేరం కాదు. దేశాలు దాటిన నేరం. దోచుకున్న డబ్బును విచ్చలవిడిగా విదేశాలకు తరలించి మళ్లీ వైట్ రూపంలో ఇండియాకు తీసుకువచ్చారు. వందలు, వేల కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ లావాదేవీలన్నీ నిరూపణ చేయాలంటే బీజేపీ కీలకం. కాంగ్రెస్ నేత ఠాగూర్ అదే చెప్పారు. బీజేపీ చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు.
నాడు క్విడ్ ప్రో కో.. నేడు లిక్కర్ స్కాం
జగన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు… తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో ద్వారా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇలా కూడా ప్రజల్ని.. ప్రజా ఆస్తుల్ని దోపిడీ చేయవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేశారు. సీఎం అయ్యాక.. లిక్కర్ స్కాం ద్వారా మరోసారి ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేశారు. ఇలా ప్రజల ఆరోగ్యాలనూ దోచుకోవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేశారు. తన అవినీతిలో .. అందర్నీ భాగం చేయడానికి ఆయన అవలంభించిన పద్దతులు కూడా అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లు దేశానికి అత్యంత ప్రమాద కరం. చర్యలు తీసుకోకపోతే అలాంటివారికి బలం పెరుగుతుంది. అందుకే మాణిగం ఠాగూర్ లాంటి వాళ్లు బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందన్నది తేలాల్సి ఉంది.