ఏపీ ఉద్యోగ సంఘం నేతలు మెల్లగా నోరు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు బాకా ఊదడానికి, ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికి మాత్రమే నోరు తెరిచేవారు. ఉద్యోగుల డిమాండ్ల గురించి నోరెత్తే సాహసం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారి ఏడాది కాక ముందే మా పీఆర్సీ.. మా డీఏలు… మా బకాయిలు అంటూ తెర ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలుగా ఉద్యోగుల బకాయిలు చెల్లించింది కూడా.
అయితే ఇప్పుడు బొప్పరాజుకు పీఆర్సీ గుర్తుకు వచ్చింది. డీఏలు గుర్తుకు వచ్చాయి. ప్రభుత్వంపై గౌరవంతోనే తాము కోర్టుకు వెళ్లడం లేదని కూడా చెబుతున్నారు. అంటే కోర్టుకు వెళ్తామని బెదిరిస్తున్నారన్నమాట. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లి తమ డిమాండ్లు నెరవేర్చుకున్నాయని చెబుతున్నారు. ఉద్యోగసంఘాల నేతలు ఉద్యగుల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన ఆ పెద్దలే దీనికి సాక్ష్యం. బొప్పరాజు కూడా రిటైర్మెంట్ కాగానే అదే దారిలో ఉన్నారేమో కానీ.. కొత్తగా మాటలు పెంచుతున్నారు.
గత ప్రభుత్వంలో వీరు చేసిన నిర్వాకానికి ఉద్యోగుల హక్కులు, పోరాట స్ఫూర్తి మొత్తం అమ్ముడుపోయింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా.. అడ్డగోలుగా వ్యవస్థకే అడ్డం తిరిగారు. ఇలాంటివి చాలా చేశారు. అయినా జగన్ రెడ్డి వీరి జీతాలకు కోత విధించారు. అప్పుడు లెగవని నోళ్లు ఇప్పుడు లేస్తే.. ఈ ప్రభుత్వం అంత సామరస్యంగా వ్యవహరించే అవకాశం ఉండదు. బొప్పరాజు అయినా.. మరొకరు అయినా.. ఖచ్చితంగా వారికిచ్చే ట్రీట్ మెంట్ వారికిస్తుందన్న అభిప్రాయాలు సహజంగానే వస్తాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉండాలన్న సూచనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.