బీఆర్ఎస్ పార్టీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రకటించింది. ఇకపై ఏబీఎన్ ఛానల్ నిర్వహించే ఏ రకమైన చర్చా కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొనకూడదని పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, పార్టీ నిర్వహించే ఎటువంటి విలేకరుల సమావేశాలకు గానీ, అంతర్గత సమావేశాలకు గానీ ఏబీఎన్ ప్రతినిధులను అనుమతించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఏబీఎన్ ఛానల్లో జరిగిన ఒక లైవ్ డిబేట్. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావుపై డిబేట్ ను నిర్వహిస్తున్న వెంకటకృష్ణ అత్యంత అనుచితంగా ప్రవర్తించారని పార్టీ ఆరోపిస్తోంది. చర్చ సాగుతుండగా ఎమ్మెల్సీని ఉద్దేశించి గెట్ ఔట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అహంకారపూరితంగా వ్యవహరించడం జర్నలిజం విలువలకు విరుద్ధమని పార్టీ మండిపడింది.
తమ పార్టీ ఎమ్మెల్సీకి జరిగిన అవమానాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్కళ్లపల్లి రవీందర్ రావుకు ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. అప్పటివరకు సదరు ఛానల్ను పూర్తిగా దూరం పెట్టాలని నిర్ణయించింది. రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు , ఇలాంటి అవమానకర ప్రవర్తనలను సహించేది లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.


