గడచిన 24 గంటల నుంచి ఏపీ విషయంలో భాజపా నేతలు కేవలం రాజకీయమే మాట్లాడుతున్నారు! ఆంధ్రప్రదేశ్ అంశం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. రాష్ట్రం కోసం కేంద్రం చేసిందేంటో చెప్పడం లేదుగానీ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరే తప్పు అనే ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక, ఈ క్రమంలో జీవీఎల్ నర్సింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించారంటూ తీవ్రంగా ఆరోపించారు!
ప్రత్యేక హోదాపై ఎప్పటికప్పుడు చంద్రబాబు వైఖరి మార్చుకుంటూ యు టర్న్ తీసుకున్నారని జీవీఎల్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రజలను మభ్యపెట్టి, మోసం చేయాలన్న ప్రయత్నం చేశారనీ, కానీ దాన్ని భాజపా సమర్థంగా తిప్పి కొట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పిందన్నారు. హోదాకి బదులుగా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని ఆయన ఒప్పుకున్నారనీ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారనీ, ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారన్నారు. ఇంకా ఆయన చాలా విమర్శలు చేశారు.
నిజానికి, పార్లమెంటు సాక్షిగా ప్రధానితో భాజపా నేతలందరూ చేస్తున్నది రాజకీయమే. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ ఆరోపించడం అర్థరహితం. ఇంకా చెప్పాలంటే బాధ్యతారాహిత్యం. ఆ మాటకొస్తే, కేసీఆర్ చంద్రబాబుల మధ్య తగాదాలు తెచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ చేశారన్నది వాస్తవం. ఇంకోటి… ఇక్కడ సమస్య చంద్రబాబు నాయుడు వెర్సెస్ మోడీ కాదు కదా! ప్రత్యేక హోదా, ఏపీ ప్రయోజనాలు వెర్సెస్ కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టం గురించి భాజపా నేతలు మాట్లాడటం మానేసి… చంద్రబాబుపై విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక, తానూ తెలుగువాడినే అని అప్పుడప్పుడూ కేరాఫ్ అడ్రస్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేసే జీవీఎల్ మరీ ఇంత అడ్డగోలుగా మాట్లాడటం విచారకరం! హోదా వద్దన్నారు, ప్యాకేజీకి జై అన్నారు, మళ్లీ హోదా కావాలంటున్నారని సీఎంపై ఎన్నిసార్లు విమర్శిస్తారు..? హోదా ఇవ్వలేమన్నది ఎవరు.. కేంద్రం, ప్యాకేజీ ఇస్తామని నమ్మబలికి ఇవ్వంది ఎవరు.. కేంద్రం, నాలుగేళ్లయినా విభజన హామీలను అమలు చేయంది ఎవరు… కేంద్రం. జీవీఎల్ పరిభాషలో చెప్పాలంటే ఈ అంశం ఏపీలో ప్రతీ చిన్నపిల్లాడికీ తెలుసు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశమై అవిశ్వాస తీర్మానం పెడితే… దాని గురించి ఏ ఒక్కరూ మాట్లాడరే..! అవిశ్వాసాన్ని తిప్పి కొట్టి, ఆంధ్రా ప్రజలకు భాజపా చెప్పిన వాస్తవాలేంటనేవి జీవీఎల్ మరింత వివరంగా చెబితే బాగుండేది.