‘ జెడి ‘వస్తే రాజకీయ వేడి!

ఐపిఎస్‌ అధికారి మాజీ సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలంగాణకు రావాలనుకుంటున్నారన్న వార్త రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తున్నది. జెడి లక్ష్మీనారాయణ అనేది ఇంటిపేరుగా మారిపోయిన ఆయన జగన్‌ కేసులోనూ ఆ సందర్బంలో వచ్చిన ఎంఆర్‌ ఎంజిఎఫ్‌ తదితర కేసుల్లోనూ అత్యంత విస్త్రత ప్రచారం పొందారు. ఆయన ఏ రోజు ఏ ప్రకటన చేస్తారా అని మీడియాతో పాటు ప్రజలూఎదురు చూసేవారు. నిజానికి కొద్దిలో తప్పిపోయింది గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు ఫైళ్లు కూడా ఆ యన దరిదాపుల్లోకి వచ్చాయి. డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌ వచ్చిన లక్ష్మీనారాయణ తర్వాత మహారాష్ట్ర వెళ్లి పూనే కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఉత్సవాలు సభల్లో కనిపిస్తూనే వున్నారు. మొదట్లో రాజకీయ సామాజికాంశాలు ప్రస్తావించేవారు గాని తర్వాత కాలంలో కేవలం ఆధ్యాత్మిక విద్యా విషయాలే మాట్లాడుతున్నారు. కేసు కూడా ఆయన చేతుల్లో లేదు గనక దానిపై మాట్లాడ్డం ఎలాగూ జరగదు. ఇలాటి నేపథ్యంలో ఆయన డిజిపి అనురాగ్‌ శర్మతో భేటీ కావడం ఆసక్తి రేకెత్తించింది. త్వరలోనే రిటైరయ్యే శర్మ స్థానంలో ప్రస్తుత హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని, లక్ష్మీనారాయణ అప్పుడు నగర కమిషనర్‌ అవుతారని ఒక కథనం. ఇంకా అయిదేళ్లు సర్వీసు వున్న ఆయన ఇక్కడే మిగిలిన కాలం గడపాలని కోరుకుంటున్నారట. కేంద్రం ఉభయ రాష్ట్రాలు ఒప్పుదలకు వస్తే కేంద్రం దీనిపై అభ్యంతరం పెట్టకపోవచ్చు. మొత్తంపైన ఆయన ఏ బాధ్యతల్లోకి వచ్చినా సరే లక్ష్మీనారాయణ హైదరాబాదులో వుండటం ఎపి నేతలపై అటు చంద్రబాబు ఇటు జగన్‌లతో సహా రాజకీయ వేడి రగిలించడం అనివార్యం. దీనిపై ఎవరెలా స్పందిస్తారో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.