బనకచర్ల పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. కేంద్రం వద్ద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తమ వాదనలు వినిపించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ వెళతారు. 16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారు. సమాచారం. 15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతు న్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.
అలాగే ఇద్దరూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బనకచర్ల పైన వివాదం కొనసాగుతున్న సమయంలో.. ఇద్దరు సీఎంలు కలిసి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం రాజకీయం కావడంతో సమస్యను రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడం అంత తేలిక కాదన్న అభిప్రాయం ఉంది. అయితే ముఖ్యమంత్రులు ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో చర్చిస్తే.. తాత్కాలికంగా అయినా ప్రస్తుత వివాదానికి ముగింపు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.