ప్రొ.నాగేశ్వర్ : చంద్రబాబు సమీక్షలు చేయకూడదా..?

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు చేయడంపై.. వివాదం రేగుతోంది. పోలవరం, సీఆర్డీఏ పనులపై చంద్రబాబు సమీక్షలు చేశారు. దీంతో వైసీపీ నేతలు…ఆయనకు ఆ అధికారం లేదనే వాదన తీసుకు వస్తున్నారు.ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా.. చంద్రబాబు కేర్ టేకర్ సీఎం అని వాదిస్తున్నారు. కోడ్ ఉన్నందున.. ఎలాంటి పనులపైనా.. కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని అంటున్నారు. అయితే మరో వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ప్రభుత్వం .. ప్రభుత్వమే. అధికారిక విధులు నిర్వహించవచ్చని అంటున్నారు.

ముఖ్యమంత్రిని ఖాళీగా కూర్చోవాలని ఎలా చెబుతారు..?

భారత ఎన్నికల సంఘం.. గతంలో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో .. చివరి దశల్లో ఎన్నికలు పెట్టేది. అంటే.. ఎన్నికలు జరిగిన నాలుగైదు రోజుల్లో ఫలితాలు వచ్చేసేవి. ఈ సారి అలా కాకుండా .. మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు పెట్టింది. ఫలితంగా.. 45 రోజుల తర్వాత కౌంటింగ్ జరగనుంంది. ఈ రోజులన్నీ… కోడ్ పేరిట ప్రభుత్వాన్ని నడవకుండా చేస్తారా.. అన్నది మరో వాదన. పోలవరంపై చంద్రబాబు రివ్యూ చేశారు. దీని వల్ల ఓటర్లపై ఏ ప్రభావం ఉంటుంది. ఏపీలో పోలింగ్ ముగిసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ ఓటర్లపై పోలవరం రివ్యూ చూపించే చూపించే ప్రభావం ఎముంటుంది..? అర్థం లేని కోడ్ కదా..?. దేనికైనా అర్థం ఉండాలి కదా..! . పోలవరం రివ్యూ వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం లేదు. అందుకే ఏ లాజిక్ ప్రకారమూ.. సీఎం రివ్యూ చేయడం అనేది తప్పే. అయితే… సాక్షి పత్రికలో.. రివ్యూలు చేసి బిల్లుల చెల్లింపులకు ఆదేశాలిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అలా చేస్తే మాత్రం కోడ్ ఉల్లంఘనే అవుతుంది. అలా చేయకూడదు. ఇలా బిల్లుల చెల్లింపు అంశాలు కాకుండా.. ఇతర రివ్యూలు చేసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. కోడ్ ఉంది కదా అని ముఖ్యమంత్రి ఖాళీగా ఉండాలా..?. కుర్చీలో కూర్చోవాలి కానీ.. ఏమీ చేయకూడదంటే ఎలా..?. అయితే కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. భారీగా చెల్లింపులు చేయకూడదు. విధానపరమైన నిర్ణయం తీసుకోకూడదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు.

ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభావితం చేసేది ఏముంది..?

ఎన్నికల సంఘం.. ముఖ్యమంత్రి విధుల విషయంలో కూడా.. ఓ హుందాతనాన్ని పాటించాలి. అదే విధంగా చంద్రబాబు తన విధుల విషయంలో.. ఓ లక్ష్మణ రేఖ గీసుకోవాలి. ముఖ్యమంత్రి అత్యవసరమైన వాటిపైనే సమీక్ష చేసుకోవాలి. 40 రోజుల్లో పట్టించుకోకపోతే.. పనులు ఆగిపోతాయని… భావించిన వాటిపై… సమీక్షలు నిర్వహించవచ్చు. వర్షాభావం వల్ల… వ్యవసాయ రంగం ఏర్పడిన పరిస్థితులు… కరువు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలాంటి వాటిపై సమీక్షలు చేయాలి. అంతే కానీ వివాదాస్పదమైన అంశాల జోలికి వెళ్లకూడదు. ఎన్నికల కమిషన్ కూడా… హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి ఏ పనీ చేయకూడదు. ఆయన కేర్ టేకర్ మినిస్టర్. వచ్చి కూర్చుని వెళ్లిపోవాలి అనడం కరెక్ట్ కాదు. రాజకీయ హుందా తనాన్ని ఇరువైపులా పాటించాలి. కేస్ టు కేస్… పరిశీలన చేసి.. సమీక్షలపై నిర్ణయాలు తీసుకోవాలి తప్ప… అసలు మొత్తానికే సమీక్షలు వద్దని చెప్పడం కరెక్ట్ కాదు.

విధానపరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవడం కరెక్ట్ కాదు..!

కొన్నాళ్ల క్రితం.. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. పార్లమెంట్‌లో బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో లెక్కలు క్లియర్‌గా ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వానికి ఎంపీల మద్దతు లేదు. ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. అలాంటి సమయంలో.. పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఉదయం అంతా చర్చ జరిగింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆసమయంలో… కేబినెట్ సమావేశమై.. మహారాష్ట్రలో ఓ కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసం .. నెగ్గడం ఖాయమని తేలిన తర్వాత ప్రభుత్వం అలా చేయడం… కరెక్ట్ కాదు. అలా చేయడం కరెక్ట్ కాదని.. ఆయనకు తెలుసు. అయినా ఒత్తిడికి గురై ఆ పని చేశారు. అలాంటి పని ఏపీలో చేస్తే.. కచ్చితంగా తప్పే. తాము అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉంటే… ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రివ్యూ చేస్తామని ప్రకటించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు.. ముఖ్యమంత్రి. ఈసీ ఇది గౌరవించాలి. అదే సమయంలో… చంద్రబాబు అధికారానికి పరిమితులు ఉంటాయి. దాన్ని కూడా.. చంద్రబాబు గుర్తించాలి. అందువల్ల.. అటు ఈసీ, ఇటు చంద్రబాబు… గుర్తించి.. ప్రతీదాన్ని వివాదం చేయకుండా.. జాగ్రత్తగా ఉండాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.