తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో… ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలకు సూచనలు పంపారు. అంతే కాదు.. వచ్చే ఆరు నెలలకు కార్యాచరణ కూడా ప్రకటించారు. ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో అన్ని విపక్ష పార్టీలో ఢిల్లీలో భారీ ఆందోళనకు చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇప్పుడు దీన్ని ముందుకు జరిపారు. అన్ని పార్టీల ఎంపీలతో… ఈ నెల చివరిలోనే ఢిల్లీలో సభ నిర్వహించాలని ఆదేశించారు. ముందస్తు సూచనలతో మారిన వ్యూహమే దీనికి కారణం అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీపై తీవ్ర స్థాయిలో అధికార వ్యతిరేకత ఉంది. ఎక్కడా గెలిచే అవకాశం లేదని ఇప్పటికే బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయి.
ఉపఎన్నికల్లో వచ్చిన ఓటమితోనే.. బీజేపీ, మోదీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లోనూ ఓడిపోతే.. లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అంచనాలున్నాయి. అందుకే ముందస్తుకు వెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. ఆ మూడు రాష్ట్రాలతో పాటే.. పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా చెబుతున్నాయి. బీజేపీతో సన్నిహితంగా ఉండే పార్టీలకు ఈ మేరకు సమాచారం వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహం మార్చారని చెబుతున్నారు.
ఢిల్లీ కేంద్రంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం బాధ్యతను ముందుగానే ప్రారంభించారని చెబుతున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో.. ఈ మేరకు.. చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఎంపీల సమావేశాన్ని నెలాఖరులోనే పెట్టడం వెనుక ఇదే వ్యూహం అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు సాధారణ ఎన్నికలు సమయానికే జరగుదాయనుకుని.. ఇప్పటి వరకూ ప్రణాలికలు వేసుకున్నారు. ధర్మపోరాట దీక్షలు.. నెలకొకటి చొప్పున ఎన్నికల వరకూ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూండటంతో వేగంగా వ్యూహాలను మార్చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆరు నెలల కార్యాచరణను ప్రకటించారు. ఆరు నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లో యూనివర్శిటీల విద్యార్థులతో పాటు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానంటున్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పి.. ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను… రాబడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ దిశగా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి … జాతీయ స్థాయి కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహానాడులో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తానని.. విపక్ష పార్టీలన్నింటిని కూడగడతానని.. పార్లమెంట్ అన్ని పార్టీలు కలిసి… కేంద్రంపై పోరాడేలా చేస్తానని ప్రకటించారు.